ICC Loses Rs 167 Crore After Hosting T20 World Cup 2024 In USA: టీ 20 ప్రపంచకప్ 2024ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. కానీ తర్వాత లాభనష్టాలు చూస్తే, అమెరికాలో పోటీలు నిర్వహించడం వల్ల రూ.167 కోట్లు నష్టం వచ్చిందని అంటున్నారు. ఈ పోటీలను వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. టోర్నమెంటులో లీగ్ మ్యాచ్ లు ఎక్కువగా అమెరికాలోనే జరిగాయి. ఇక ప్రపంచమంతా ఆసక్తిగా చూసినా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కూడా అక్కడే జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొలంబోలో ప్రారంభం కానున్న ఐసీసీ వార్షిక సదస్సులో ఈ నష్టంపై చర్చించనున్నట్టు తెలిసింది.
ఎందుకింత నష్టం జరిగిందంటే రకరకాల కారణాలు చెబుతున్నారు. నిజానికి అమెరికాలో వర్షాల కారణంగా చాలా మ్యాచ్ లు రద్దయిపోయాయి. అందువల్ల ప్రజలు స్టేడియంలకు రాలేదు. అలాగే మ్యాచ్ లు జరగలేదు. ఒకవేళ జనం రాకపోయినా సరే, మ్యాచ్ జరిగితే, శాటిలైట్ రైట్స్, ప్రకటనలు ఇంకా ఇతర మార్గాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అసలు మ్యాచ్ లే జరగకపోవడంతో నష్టం గట్టిగా తగిలినట్టు చెబుతున్నారు.
ఈ రద్దయిన వాటిల్లో ఇండియా-ఐర్లాండ్ మ్యాచ్ కూడా ఒకటి ఉంది. అలాగే వర్షం కారణంగా అమెరికా 5 పాయింట్లతో సూపర్ 8కి వెళ్లిపోయింది. పాకిస్తాన్ 4 పాయింట్లతో వెనుకపడిపోయింది. ఇంగ్లండ్ కూడా చావుతప్పి కన్నులొట్టపోయి సూపర్ 8కి ఆఖరిదశలో చేరింది. ఇలా కొన్ని ఇంపార్టెంట్ మ్యాచ్ లు రద్దయిపోయాయి. దీంతో అభిమానులకు ఆసక్తి లేకుండా పోయింది.
అంతేకాకుండా అమెరికాలో అప్పటికప్పుడు టీ 20 ప్రపంచకప్ కోసం స్టేడియంలను సిద్ధం చేశారు. వాటికే కోట్ల రూపాయల ఖర్చయ్యింది. ఇవన్నీ కలిసి తడిసిమోపెడయ్యాయని, వర్షం కారణంగా ఆ లాభం గూబల్లోకి వచ్చిందని అంటున్నారు. అదే రూ.167 కోట్ల నష్టంగా చూపిస్తున్నారని చెబుతున్నారు. రాబోవు రోజుల్లో క్రికెట్ స్టేడియంలను శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తే, ఈ నష్టం చాలావరకు కవర్ అవుతుందని అంటున్నారు.
Also Read: కష్టపడితే తప్పక ఫలితం ఉంటుంది: హార్దిక్ పాండ్యా
అయితే ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్న అమెరికాలో క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించడానికి చేసిన ప్రయత్నం మాత్రం సఫలీక్రతమైందనే అంటున్నారు. ఎందుకంటే అమెరికా జట్టు అద్భుతంగా ఆడటమే కాదు, సూపర్ 8లోకి అడుగుపెట్టింది. లీగ్ దశలో పాకిస్తాన్ లాంటి జట్టును ఓడించింది. ఇండియాకి చెమటలు పట్టించింది. మున్ముందు ఇదే రీతిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తే, అమెరికా పెద్ద జట్లకు సవాల్ విసురుతుందని అంటున్నారు. అందువల్ల రాబోవు రోజుల్లో అమెరికాలో కూడా క్రికెట్ కి ఆదరణ పెరుగుతుందని నొక్కి చెబుతున్నారు.