Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రకటించినట్టుగానే ఈ రోజు రైతులకు రుణమాఫీని అమలు చేసింది. రూ. 1 లక్షలోపు సాగు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు సాయంత్రం రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల రూ. 1 లక్షలోపు రుణాలు మాఫీ అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.50 లక్షల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. రూ. 1 లక్షలోపు రుణాల మాఫీ కోసం ప్రభుత్వం రూ. 6,098 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ బ్యాంకులకు బదిలీ చేసింది. అత్యధికంగా నిధులు నల్గొండ జిల్లాకు దక్కాయి. అంటే ఈ జిల్లాలోనే ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ జరిగినట్టు తెలుస్తున్నది.
లోక్ సభ ఎన్నికల వేళ తాము రూ. 2 లక్షలలోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు హామీ ఇచ్చారు. ఈ హామీకి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పంద్రాగస్టులోపు ఈ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే.. తొలి విడతలో భాగంగా రూ. 1 లక్ష లోపు రుణాలను ఈ రోజు ప్రభుత్వం మాఫీ చేసింది. ఇక లక్షన్నర లోపు రుణాలను ఈ నెలాఖరు కల్లా మాఫీ చేస్తామని ప్రకటించింది. వచ్చే నెలలో రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని తెలిపింది.
Also Read: శుక్రవారం నాడు పూజలో వీటిని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుంది..
రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు జమ అయ్యాయి. దీంతో రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. అనంతరం, రుణాలు మాఫీ అయిన రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.