Budget 2024| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డియే ప్రభుత్వం గత సంవత్సరం (223-24)లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా మహామాంద్యం గుప్పిట్లో ఊపిరాడని పరిస్థితిలో ఉన్నాయి. ఓ వైపు అగ్రరాజ్యం అమెరికా, ప్రపంచ బిజినెస్ని తన తక్కువ ధర ఉత్పత్తులతో శాసించే చైనా సైతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. మరో వైపు శ్రీలంక, పాకిస్థాన్ తదితర పొరుగుదేశాల్లో నిత్యావసరల ధరలు పెరిగిపోయి ప్రజలు కడుపునిండా తినలేని దారుణమైన పరిస్థితి.
ఈ నేపథ్యంలో కరోనా దెబ్బ నుంచి కోలుకుంటున్న భారత ఎకానమీని త్వరగా పుంజుకనేందుకు గత సంవత్సరం సమర్థవంతంగా బడ్జెట్ రూపొందొంచిన నిర్మలా సీతారామన్ బృందంపైనే అందరి కళ్లూ. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తూనే.. పురోభివృద్ధికి ఊతం ఇవ్వాల్సి ఉంది. అదే సమయంలో విదేశీ మదుపరుల విశ్వాసాన్నీ చూరగొనాల్సి ఉంది. ఇన్ని విధాలుగా అనుకూలమైన బడ్జెట్ 2023-24ను రూపొందించి దేశాన్ని ముందుకు నడిపించిన ఆర్థిక మేధావుల గురించి తెలుసుకుందామా?
నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రిగా లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే బాధ్యత నిర్మల సీతారామన్ నిర్వర్తిస్తారు. ఇప్పటికే ఆమె అయిదు సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇంతకుముందు ఆమె వాణిజ్యమంత్రిగా, రక్షణమంత్రిగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ డిగ్రీ పూర్తిచేసిన నిర్మలా సీతారామన్కు ఆర్థిక లోటు పాట్లపై మంచి పట్టుఉంది. రుణభారం, ద్రవ్యలోటుని తగ్గించడంపై నిర్మల ప్రత్యేక దృష్టి సారిస్తారు.
టీవీ సోమనాథన్
తమిళనాడు కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన టీవీ సోమనాథన్ ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆర్థికశాఖ అధికారుల్లో సోమనాథన్ ప్రముఖుడు. ఆర్థిక శాస్త్రంలో ఆయన డాక్టరేట్ పొందారు. ఇంతకుముందు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో)లోనూ 2015-17 మధ్య పనిచేశారు. ఆర్థిక వ్యవహారాలు, ప్రభుత్వ విధానాలపై 80కిపైగా పేపర్లు సమర్పించారు. చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీగా విశేష అనుభవం ఉంది. సోమనాథన్ నేతృత్వంలో మూలధన వ్యయాన్ని ఆర్థిక శాఖ ఎన్నో రెట్లు పెంచగలిగింది.
Also Read: కొత్త బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్లో ఏది ఉచితం?
అజయ్ సేథ్
అజయ్ సేథ్.. ఆర్థిక వ్యవహారాల విభాగం ఇన్చార్జి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక కేడర్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మృదుస్వభావి అయిన అజయ్ సేథ్.. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. చదివారు. మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా. బడ్జెట్ తయారీలో కీలక పాత్ర ఆయనదే. బడ్జెట్ అంచనాలను వివిధ శాఖల నుంచి స్వీకరించి.. వాటిని అందుబాటులో ఉండే నిధులతో పొల్చి తుదిరూపు ఇచ్చే బడ్జెట్ విభాగాని ఆయన నేతృత్వం వహిస్తారు.
సంజయ్ మల్హో త్రా
రెవెన్యూ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న రాజస్థాన్ కేడర్ 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా. ఆయన ఇంతకుముందు ఆర్థిక సేవల విభాగం పనిచేసేవారు.. అక్కడి నుంచి 2023లో రెవెన్యూకి బదిలీ అయ్యారు. గతంలో ఆర్ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అనుభవం కూడా ఉంది.
తుహిన్ కాంత పాండే
ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్న తుహిన కాంత పాండే.. ఒడిసా కేడర్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించింది ఈయనే.
వి.అనంత నాగేశ్వరన్
ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ)గా 2022 బడ్జెట్ సమర్పణకు కొద్ది రోజుల ముందు అనంత నాగేశ్వరన్ నియమితులయ్యారు. ఆర్థిక సర్వే నివేదికతో పాటు బడ్జెట్ 2023 రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ మసాచుస్సెట్స్ నుంచి ఫైనాన్స్లో పీహెచ్డీ చేశారు. కార్పొరేట్ రంగంలో 17 ఏళ్ల సుదీర్థ అనుభవం ఉంది.
వివేక్ జోషి
ఆర్థిక సేవల విభాగం సెక్రటరీగా వివేక జోషి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన అంతకు ముందు గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సీఈవోగా, హోంశాఖలో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్గా సేవలందించారు. నార్త్బ్లాక్లో ప్రభుత్వ వ్యయ విభాగం సెక్రటరీగా 2014-17 మధ్య పనిచేసిన అనుభవం ఉంది. 1989 బ్యాచ్ ఐఏఎస్ హరియాణా కేడర్ అధికారి. పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. రూర్కీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు.