BholeBaba comments: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ ఘటన తర్వాత మరోసారి వార్తల్లోకి వచ్చేశారు భోలేబాబా. ఈసారి మరో అడుగు ముందుకేసి వేదాంత ధోరణిలో మాట్లాడారు. విధి రాతను ఎవరు తప్పించలేరని, అందరూ ఏదో ఒక రోజు మరణిస్తారన్నారు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 123 ప్రాణాలు కోల్పోయారు. విచారణ చేపట్టిన పోలీసులు మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. భక్తులు అధికంగా రావడంవల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని అంటున్నారు నిర్వాహకులు.
తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న బాబా నారాయణ్ శంకర్హరి అలియాస్ భోలేబాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తర్వాత ఇప్పటికీ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నామన్నారు. విధి రాతను ఎవరూ తప్పించలేరని వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ చనిపోతారని, కాకపోతే ముందు, వెనుక ఆలస్యమవుతుందన్నారు. కొందరు వ్యక్తులు తమ సంస్థ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల పరువు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే తొక్కిసలాట జరిగిందని, దీని వెనుక కుట్ర ఉందన్నది భోలే బాబా వ్యాఖ్య.
ALSO READ: ఇన్స్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రమాదం.. గోతిలో పడి ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ మృతి!
సత్సంగ్ కోసం భోలేబాబా తన పేరు మీద కాకుండా మరొకరి పేరు మీద పర్మీషన్ తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు దేవిప్రకాష్ మధుకర్, సహాయకులుగా వ్యవహరించిన ఉపేంద్ర మంజు, ముకేష్ కుమార్లు ఉన్నారు. సిట్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ ఘటనకు ఈవెంట్ నిర్వాహకులదే బాధ్యతని తేల్చింది. మరోవైపు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి హేమంత్రావు నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.