Aanvi Kamdar| సోషల్ మీడియాలో ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరుపొందిన 26 ఏళ్ల ఆన్వి కామ్ దార్ చనిపోయారు. మహారాష్ట్రలోని రాయ్ గడ్ ప్రాంతంలో కుంభె వాటర్ ఫల్ సమీపంలో ఇన్స్స్టాగ్రామ్ రీల్స్ షూటింగ్ చేస్తూ.. పక్కనే 300 అడుగుల లోతున ఉన్న గోతిలో ప్రమాదవశాత్తు పడిపోయారని పోలీసులు తెలిపారు.
గోతి నుంచి సహాయక బృందం ఆరు గంటలపాటు కష్టపడి ఆమెను సురక్షితంగా బయటికి తీసింది. కానీ ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. గోతిలో పడినప్పడు ఆమె శరీర లోపలి భాగాల్లో తగిలిన గాయాల కారణంగా ఆమె మృతి చెందారని డాక్టర్లు తెలిపారు.
జూలై 16న ఆన్వి కామ్ దార్ తన ఏడుగురు స్నేహితులతో కలిసి కుంభె వాటర్ ఫల్ వద్దకు ఇన్స్స్టాగ్రామ్ రీల్స్ చేసేందుకు వెళ్లారు. సాయంత్రం షూటింగ్ చేసే సమయంలో ఆమె కాలు జారి గోతిలో పడిపోయారు. ఆ తరువాత ఆమె స్నేహితులు పోలీసులకు ఫోన్ చేయగా.. రక్షణ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. కానీ ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండడంతో గోతిలో చుట్టూ ఉన్న రాళ్లు ఆమె మీద పడ్డాయి. దీంతో ఆమెను కాపాడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. పోలీసులు పరిస్థితిని గమనించి అదనంగా కోస్ట్ గార్డ్, కొలాడ్ రెస్కూ టీమ్, మహారాష్ట్ర ఎలెక్ట్రిసిటీ సిబ్బందిని సాయం కోసం మోహరించారు.
Also Read: ధోతీ ధరించాడని మాల్లోకి రానివ్వని సెక్యూరిటీ సిబ్బంది
ఆరు గంటలపాటు అందరూ కష్టపడిన తరువాత ఆమెను బయటికి తీయడానికి వర్టికల్ పుల్లీని ఉపయోగించారు. చివరికి ఆమెను వెలికితీశాక సమీపంలోని మన్ గావ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆన్వి చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
ముంబైకి చెందిన ఆన్వి నామ్ దార్ వృత్తి రీత్యా ఒక చార్టడ్ అకౌంటెంట్. డెలాయిట్ కంపెనీలో కూడా ఆమె కొంతకాలం పనిచేశారు. ట్రావెలింగ్ పై మక్కువతో ఆమె యూట్యూబ్, ఇన్స్ టాగ్రామ్ లో వీడియోలు చేసేవారు. తను ప్రయాణం చేసిన ప్రదేశంలో ప్రకృతి అందాల గురించి ఆమె తన అనుభూతులను తన ఫాలోవర్స్తో పంచుకునేది. ముఖ్యంగా వర్షాకాలంలో మాన్ సూన్ టూరిజం పేరుతో ఆమె చేసే వీడియోలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభించింది. తన వీడియోలలో ఆమె ప్రకృతిపరంగా అందమైన ప్రదేశాలకు వెళ్లి అక్కడ ఉన్న సౌకర్యాలు, హోటళ్లు, అక్కడికి చేరుకోవడానికి దారి, చుట్టుపక్కల ఉన్న కెఫెలు అన్ని వివరించేవారు.
ఇన్స్ టాగ్రామ్ లో ఆన్వికి 2 లక్షల 50 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.