Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. షరద్ పవార్ ఎన్ సీపీలోకి అజిత్ పవార్ తిరిగి రాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై షరద్ పవార్ మీడియా సమావేశంలో స్పందించారు. విలేకరుల సమావేశంలో షరద్ పవార్ మాట్లాడుతూ.. “ఇలాంటి నిర్ణయాలు వ్యక్తిగత స్థాయిలో తీసుకోలేను.. కష్టాలు ఎదురైనప్పుడు నాకు తోడుగా నిలబడిన పార్టీ నాయకులంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. వాళ్లే సంయుక్తంగా అజిత్ పవార్ తిరిగి వస్తే.. పార్టీలో చేర్చుకోవాలో లేదో నిర్ణయిస్తారు,” అని అన్నారు.
అజిత్ పవార్ గతంలో తన బాబాయ్ షరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సిపీ) నుంచి విడిపోయి.. కొంతమంది పార్టీ నాయకులతో వేరే ఎన్ సీపీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత బిజేపీ, ఏక్ నాథ్ షిండ్ వర్గంతో మహాయుతి కూటమిగా ఏర్పడి.. ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. కానీ కొన్ని నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్ సీపీని ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. మరోవైపు షరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్ కూటమికి భారీ ప్రజాదరణ లభించింది.
Also Read: భయపడ్డ సిద్ధరామయ్య సర్కార్.. ప్రైవేట్ జాబ్ కోటా బిల్ నిలిపివేత!!
పైగా ఇటీవల షరద్ పవార్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసిన మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది. ఈ పరిణామాలతో ఖంగుతిన్న అజిత్ పవార్ ఎన్ సీపీ నాయకులు తిరిగి షరద్ పవార్ చెంతకు చేరుతున్నారు. 25 మంది అజిత్ పవార్ ఎన్ సీపీకి చెందిన పింప్రీ ఛిన్చివాడ్ ప్రాంత నాయకులు బుధవారం.. షరద్ పవార్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరిపోయారు. ఇంతమంది ఒకేసారి శరద్ పవార్ పార్టీలో చేరిపోవడం.. అజిత్ పవార్కు గట్టి దెబ్బు. పార్టీ మారిన వారిలో 20 మంది మునిసిపల్ కార్పొరేటర్స్, కొందరు మహిళా నాయకులు ఉన్నారు. వీరందరూ షరద్ పవార్ పార్టీ జెండా పట్టుకొని ఆయనే మా నాయకుడు అంటూ ర్యాలీలాగా ఏర్పడి షరద్ పవార్ నివాసానికి చేరుకున్నారు.
పార్టీ మారిన నాయకులలో కీలక నేతలు.. ఎన్ సీపీ సిటీ ప్రెసిడెంట్ అజిత్ గవ్ హానె, ఎన్ సీపీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ భోసలె, స్టూడెంట్ వింగ్ చీఫ్ యష్ సానె, భోసరీ అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు పంకజ్ భాలేకర్ ఉన్నారు. వీరంతా బుధవారం అజివ్ పవార్ ఎన్ సీపీకి రాజీనామాలు సమర్పించారు. పైగా మరింత మంది పుణె నుంచి పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై అనుమానాలు ఉండడంతో వీరంతా పార్టీ మారినట్లు తెలిపారు.
మరో నాలుగు రోజుల్లో (జూలై 20న) షరద్ పవార్ స్వయంగా పింప్రీ ఛిన్చివాడ్ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఇంతమంది నాయకుడు పార్టీ మారడం.. అజిత్ పవార్కు రాజకీయంగా పెద్ద నష్టమే.
ఈ రాజకీయాల పరిణామాలతో చాలామంది రాజకీయ విశ్లేషకులు అజిత్ పవార్ తిరిగి సొంత గూటికి వస్తారని.. తన బాబాయ్ షరద్ పవార్ చెంతకు చేరుతారని అభిప్రాయపడుతున్నారు.