Will Jay Shah become the new ICC chairman or Greg Barclay will continue till 2025: భారతదేశానికి బ్రాండ్ వాల్యూ రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యున్నత సంస్థలన్నీ కూడా భారతీయులను సీఈవోలుగా నియమిస్తోంది. బ్రిటీష్ ప్రధానిగా మొన్నటి వరకు పనిచేసిన రిషీ సునాక్ కూడా భారత సంతతికి చెందినవారే. ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో నేడు కాకపోయినా, వచ్చే టెర్మ్ లోనైనా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అధ్యక్ష స్థానానికి రేస్ లో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇలా ప్రతీచోటా భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉంటూ భారతదేశ గౌరవాన్ని పెంపొందింపచేస్తున్నారు. అన్నింటికి మంచి నేడు భారతదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. దీనిని ఆలంబనగా తీసుకుని ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషాను ఐసీసీ ఛైర్మన్ గా చేసే ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరొక్కరోజులో ఆ శుభవార్త అందే అవకాశాలున్నాయి.
శుక్రవారం నాడు కొలంబోలో జరగనున్న వార్షిక సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు. న్యూజిలాండ్ కి చెందిన గ్రెగ్ బార్క్ లే ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన్ని 2025 వరకు కొనసాగించే అవకాశాలున్నాయి. ఒకవేళ అక్కడ అటూ ఇటూ అయితే, జైషా ఛైర్మన్ పదవిని చేపట్టేందుకు ఆస్కారమైతే ఉంది. ఇప్పుడు ఈ అంశంపై నెట్టింట వేడెక్కిపోతోంది.
మనవాడు అక్కడ ఉంటే, క్రికెట్ కి ఇంకా మేలు జరుగుతుందని అంటున్నారు. భారత క్రికెట్ ఇంకా పటిష్టంగా మారుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా జైషా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఐసీసీ అధ్యక్ష పదవిలోకి వెళితే, బీసీసీఐ కార్యదర్శితో పాటు ఇది కూడా వదులుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
Also Read: ఎవరు వెళతారు? శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఎంపిక నేడు
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కుమారుడు జైషా అన్న సంగతి అందరికీ తెలిసిందే. 2009లో బీసీసీఐ కార్యదర్శిగా నియమితుడైన జైషా.. రికమండేషన్ తో వచ్చినా, స్వీయ ప్రతిభతో ఆ పదవికి వన్నెతెచ్చాడనే చెప్పాలి. అంతేకాదు క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆసియాలో పలు దేశాలు నేడు క్రికెట్ ఆడేందుకు ముందుకు రావడంలో తన పాత్ర కీలకంగా ఉంది. ఆఫ్గనిస్తాన్ లాంటి జట్లకు బీసీసీఐ ఆర్థిక సాయం చేస్తోంది. ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇక ఐసీసీ చైర్మన్ అయితే, భారతదేశ కీర్తి మరింత వెలుగుతుందనడంలో సందేహమే లేదు.