India squad announcement for Sri Lanka T20Is and ODIs: టీ 20 ప్రపంచకప్ సంబరాలు ముగిశాయి. యువజట్టుతో కూడిన టీమ్ ఇండియా ఆల్రడీ జింబాబ్వే వెళ్లి వచ్చేసింది. ఇప్పుడు జులై 27 నుంచి శ్రీలంక పర్యటన మొదలు కానుంది. అక్కడ మూడు టీ 20లు, మూడు వన్డేలు ఆడనున్న జట్టును నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.
ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న టీ 20 కెప్టెన్ పేరు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా జరిగితే హార్దిక్ పాండ్యాకు వన్డే ఫార్మాట్ వరకే కెప్టెన్సీ దొరుకుతుందా? అనే సందేహాలకు తెరపడనుంది. ఒకవేళ రెండు ఫార్మాట్లకి తను కెప్టెన్ కాకపోతే, సీనియర్లలాగే సెలవు పెట్టే యోచనలో ఉన్నాడా? అనే విషయానికి క్లారిటీ వస్తుంది. మొత్తం ఈ ఒక్కరోజులో మబ్బులన్నీ విడిపోనున్నాయని అంటున్నారు.
అలా జరిగితే టీ 20కి 2026 ప్రపంచకప్ వరకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉంటాడని అంటున్నారు. అలాగే రాబోవు మూడేళ్లలో వచ్చే వన్డే వరల్డ్ కప్ 2027కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉంటాడు. ఇకపోతే 2025లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడని వార్తలు వస్తున్నాయి.
ఏదేమైనా శ్రీలంక పర్యటనలో రెండు ఫార్మాట్లు ఉన్నాయి కాబట్టి, వన్డే, టీ 20 టీమ్ లు రెండూ వేర్వేరుగా ఎంపిక చేస్తారని అంటున్నారు. అలాంటప్పుడు జింబాబ్వే టూర్ కి వెళ్లిన టీ 20 టీమ్ ఇక్కడ కూడా ఉండవచ్చునని చెబుతున్నారు. అలాగే వన్డేలకు వస్తే కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ తదితరులు ఉంటారని అంటున్నారు.
Also Read: శ్రీలంక గల్లీ క్రికెట్లో సంజు శాంసన్ బ్యాట్లు
మరోవైపు 2027 వరల్డ్ కప్ కి సన్నాహకంగా కొందరిని తయారు చేయాలనుకుంటే శివమ్ దూబె లాంటివారికి రెండు ఫార్మాట్లలో ఆడే అవకాశాలు రావచ్చునని అంటున్నారు. ఇవన్నీ కూడా కొత్త కోచ్ గౌతం గంభీర్ అనుమతి మేరకే ఉంటాయని కూడా చెబుతున్నారు. మరేం జరుగుతుందో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.