Exit Polls: ఇప్పటికే వరుసగా ఐదుసార్లు గెలిచింది. సుదీర్ఘకాలంగా గుజరాత్ ను పరిపాలిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది.. ఈసారి ఏం గెలుస్తుందిలే అనుకున్నారు కొందరు. మార్పు మంచికేనంటూ ఆప్ అడుగుపెట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనంటూ పోలింగ్ కు ముందే పేపర్ మీద రాసిచ్చేశారు కేజ్రీవాల్. ఇక, కాంగ్రెస్ సైతం ఈసారి గట్టి పోటీ ఇస్తామంది. ఇలా కొంతకాలంగా ఉత్కంఠ రేపిన గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్.. పోలింగ్ ముగిసే సరికి గెలుపెవరిదో తేలిపోయింది.
ఆరోసారి కూడా బీజేపీదే అధికారమంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒక్కమాట మీద నిలిచాయి. మోదీ ఇమేజ్ కమలానికి భారీగా ఓట్లు తెచ్చిపెట్టబోతోంది. ఎంతో హడావుడి చేసిన ఆప్ సింగిల్ డిజిట్ కే పరిమితం కానుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే, గుజరాత్ లో ఎప్పటిలానే అంతగా ప్రభావం చూపని కాంగ్రెస్.. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం బీజేపీతో హోరాహోరీగా తలపడిందని తెలుస్తోంది.
గుజరాత్ మళ్లీ బీజేపీదే..
పీపుల్స్ పల్స్ సర్వే: బీజేపీ 125 -143; కాంగ్రెస్ 30-48; ఆప్ 3-7; ఇతరులు 2-6
న్యూస్ ఎక్స్ సర్వే: బీజేపీ 117 -140, కాంగ్రెస్ 34-51, ఆప్ 6-13
ఆత్మసాక్షి: బీజేపీ 98-110; కాంగ్రెస్ 66-110; ఆప్ 9-14
ఔట్ ఆఫ్ ద బాక్స్: బీజేపీ 130-145; కాంగ్రెస్ 25-35; ఆప్ 5-7
హిమాచల్లో హోరా హోరీ..
రిపబ్లిక్ టీవీ పి-ఎంఏఆర్క్యూ: బీజేపీ 34 -39; కాంగ్రెస్ 28-33, ఆప్ 0-1
న్యూస్ ఎక్స్: బీజేపీ 32-40, కాంగ్రెస్ 27-34, ఆప్ 0
టైమ్స్ నౌ-ఈటీజీ: బీజేపీ 38, కాంగ్రెస్ 28, ఆప్ 0
గుజరాత్లో మొత్తం 182 సీట్లకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. హిమాచల్ప్రదేశ్లో మొత్తం 68 స్థానాలకు నవంబర్ 12న ఒకేసారి పోలింగ్ నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కడుతుండగా.. డిసెంబర్ 8న అసలు ఫలితాలు వెల్లడికానున్నాయి.