Almatti dam storage touches 100 TMC Srisailam project would receive good inflows
రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఎడతెగని సమస్యగా తయారయిన నేపథ్యంలో కృష్ణా నది జలకళను సంతరించుకుని ఉరకలెత్తుతోంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో కురిసిన భారీ వర్షాలకు భారీగా నీరు వచ్చి చేరడంతో తెలుగు రాష్ట్రాలలో దిగువన ఉన్న కృష్ణానది నిండుకుండలా మారింది. ప్రతి సంవత్సరం వేసవిలో పూర్తిగా అట్టడుగు స్థాయికి చేరుకునే కృష్ణా నది నీటి కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా నీటి పంచాయితీ జరుగుతున్న విషయం విదితమే. బచావత్ ట్రిబ్యునల్ అదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలలో నీటి పంపకాలు జరుగుతున్నాయి. జూన్ లో అంతంత మాత్రం కురిసిన వర్షాలతో అసలు ఈ సారి ప్రాజెక్టులు నిండుతాయా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అంచనాలు తలకిందులు చేస్తూ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి వరదతో ఈ సంవత్సరం కూడా కృష్ణానది నీటిపై గొడవలు లేకుండా వుంటాయని అంతా భావిస్తున్నారు.
ప్రమాదకర స్థాయిలో ఆల్మట్టి
ఒక్కసారిగా వచ్చిన వరదతో ఆల్మట్టి డ్యామ్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు 14 గేట్లు ఎత్తివేశారు. దీనితో 65 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా కర్ణాటక అధికారులు ఆల్మట్టి పరిసర ప్రాంతాలలో ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటిమట్టం 129 టీఎంసీలు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 100 టీఎంసీల నీరు చేరడంతో ముందు జాగ్రత్తగా అధికారులు నీటిని క్రమంగా కిందికి వదులుతున్నారు. దీనితో దిగువ ప్రాంతమైన నారాయణపూర్ డ్యామ్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు కూడా అధికంగా నీటి మట్టం పెరుగుతోంది. దాంతో జూరాలలో జల విద్యుత్ పనులు మొదలుపెట్టారు అధికారులు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద
శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండటానికి మరో 80 టీఎంసీల చేరువలో ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో మరో 5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మరో వైపు వరుసగా అల్పపీడనాలు..దీనితో రుతుపవనాలు చురుకుగా సాగటంతో తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీనితో శ్రీశైలం ప్రాజెక్టు కు పూర్తి స్థాయి నీరు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వరద పరిస్థితులు ఎదుర్కోవడానికి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు.