YCP party latest news(Andhra pradesh political news): పార్టీ కష్టాల్లో ఉంటే అధినేతలు ఏం చేస్తారు? నేతలు ఇబ్బందుల్లో చిక్కుకుంటే పార్టీ పెద్దలు ఏం చేస్తారు? మాములుగా అయితే అండగా ఉంటారు. నేనున్నానని ధైర్యమిస్తారు.. భరోసా కల్పిస్తారు. కానీ తన రూటే సపరేట్ అంటున్నారు మాజీ సీఎం.. వైసీపీ పార్టీ అధినేత.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అవును పార్టీ నేతలు పుట్టేడు కష్టాల్లో ఉంటే ఆయన మాత్రం పత్తా లేకుండా వెళ్లిపోయారు.
వైఎస్ జగన్ ఎక్కడున్నారు..? ఈ క్వశ్చన్కు ఆన్సర్ అందరికి తెలిసిందే.. బెంగళూరులోని ఆయన నివాసంలో అని టక్కున చెప్పేస్తారు. మరి ఆయన బెంగళూరుకు ఎందుకు వెళ్లారు? తెలియదు. ఎప్పుడు వస్తారు? తెలియదు. మరి అప్పటి వరకు బాధ్యతలు చూసుకునేది ఎవరు? తెలియదు. నేతల పరిస్థితి ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్టుగా ఉంది. సరే అందరూ ఆనందంహా ఉంటే అది వేరు. కానీ.. పార్టీ పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదు. జగన్తో సహా పార్టీ కీలక నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. కొందరు పార్టీ నేతలపై మాటల దాడి జరుగుతోంది. మరికొందరు నేతల క్యారెక్టర్పైనే యుద్ధం జరుగుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కదనరంగంలో ఉండి కత్తి తిప్పాల్సిన అధినేత ఇలా కనిపించడకుండా పోవడం దేనికి సంకేతం? ఈ పద్ధతితో ఆయన పార్టీ నేతలకు ఏం సందేశం ఇస్తున్నారు?
నిజానికి వైసీపీ నేతలంతా ఇప్పుడు చాలా బిజీగా గడుపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతల కారణంగా చాలా బిజీగా గడిపిన వారంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది లిస్ట్. ఇప్పుడు వీరందరిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో స్వయంగానో.. లేదా వారి తరపున లాయరో కోర్టు మెట్లెక్కని వారు లేరంటే నమ్మాల్సిందే..
జోగి రమేష్, సజ్జల, ఆళ్ల, దేవినేని వీరంతా ఇప్పుడు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కొడాలి నాని కూడా ఈ లిస్ట్లో చేరిపోయారు. అంతేందుకు ఏకంగా వైఎస్ జగన్పై కూడా కేసు నమోదైంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును టార్చర్ చేశారన్న దానిపై జగన్తో సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కూడా కేసు నమోదైంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు, వ్యాపారాలపై కూడా కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆయనకు కూడా ఇప్పుడు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.
ఇవి జగన్కు అత్యంత ఆప్తుడైన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ప్రకాశం జిల్లా నా గడ్డ.. ఐదు సార్లు ఎమ్మెల్యేను అని చెప్పుకునే నేత పరిస్థితే ఇలా ఉంది. మరి ఆయన బాధను పట్టించుకునే వారు ఎవరు? ధైర్యం చెప్పేవారు ఎవరు? ఆయనకు డైరెక్షన్ చూపించే వారు ఎవరు? సరే ఆయన బాధలేవో ఆయన పడతారనుకుందాం. ఆయన కామెంట్స్ అక్కడితో ఆగలేదు.. ఆయన మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. వారి సమస్యలు పక్కన పెట్టండి. పార్టీ సమస్యలనైనా ఇప్పుడు పట్టించుకోకపోతే ఎలా? అప్పుడంటే సీఎంగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కూడా టైమ్ దొరకడం లేదా జగన్కి.. ? బాలినేని మాత్రమే కాదు.. మొన్న విజయసాయి రెడ్డి కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు.
Also Read: ఎర్రమట్టి దిబ్బల్లో ఎరుపెక్కిన రాజకీయం
వీరి మాటలు వింటుంటే.. అపోజిషన్ పార్టీ నేతలు పెట్టే ఇబ్బందుల కన్నా.. సొంత పార్టీలో జరిగే కుట్రలు కూడా వీరిని ఇబ్బందులు పెడుతున్నాయని తెలుస్తోంది. మరి ఈ విషయాలన్ని జగన్కు తెలియడం లేదా? లేక తెలిసి కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారా? మరి ఆయనకే తెలియాలి. ఏదేమైనా ప్రస్తుతం పార్టీ సంక్షోభంలో ఉంది. నేతల మోరల్ దెబ్బతిన్నది. దీనికి తోడు కేసుల భూతం వారిని వెంటాడుతోంది. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మరి పార్టీ నేతలకు అండగా ఉండి కాపాడుకోవాల్సిన అధినేత మాత్రం ఏకంగా రాష్ట్రంలోనే లేరు. ఇది నిజంగా నెగటివ్ వైబ్స్ను పంపుతుంది క్యాడర్లోకి కాబట్టి.. జగన్ మేల్కోకపోతే అసలుకే మోసం జరగడం ఖాయం.
ఈ విషయాలన్ని చూస్తుంటే ఓ విషయం గుర్తొస్తుంది. ఎన్నికల ముందు తనను అర్జునుడితో పోల్చుకునేవారు జగన్.. కౌరవులతో యుద్ధం చేస్తున్నానని అనేవారు. కానీ జగన్ అప్పుడు కాదు యుద్ధం చేసింది. ఆయన ఇప్పుడు అసలైన కదనరంగంలో ఉన్నారు. కానీ ఆయన కీలక సమయంలో అస్త్రసన్యాసం చేసినట్టు కనిపిస్తోంది. మరి ఆయన ఎవరైనా వచ్చి గీతోపదేశం చేస్తారా? అని ఎదురుచూస్తున్నారా?