UP Political Crisis: ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ని బీజేపీ హైకమాండ్ మార్చే పనిలో ఉందా? అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య భేటీ వెనుక కారణమేంటి? యూపీలో ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నాయకత్వాన్ని మార్చాలని కమలనాథులు ఆలోచిస్తున్నారా? ఇవే ప్రశ్నలు యూపీ కమలనాధులను వెంటాడుతున్నాయి.
లోకసభ ఎన్నికల ఫలితాలపై యూపీ బీజేపీలో తుపాను మొదలైనట్టు కనిపిస్తోంది. ఈసారి అక్కడ బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. దాని ప్రభావం యూపీ నేతలపై పడింది. ఇందులోభాగంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. మౌర్య ఒక్కరే సింగిల్ వెళ్లడంతో యూపీ బీజేపీలో చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికల ఫలితాలతోపాటు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల గురించి చర్చించే అవకాశమున్నట్లు ఢిల్లీ సమాచారం.
అంతకుముందు జేపీ నడ్డాతో యూపీ బీజేపీ ప్రెసిడెంట్ భూపేంద్రచౌదరి సమావేశమయ్యారు. ఇలా వరుస గా యూపీ బీజేపీ కీలక నేతలు నడ్డాతో సమావేశంకావడం పలు అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చుతున్నారంటూ సంకేతాలు లేకపోలేదు. యూపీలోని త్వరలో 10 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల జరగనున్నాయి. దాని తర్వాత సీఎం యోగిని మార్చే ఛాన్స్ ఉందంటూ ఆ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నమాట.
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉంది. ఈలోగా పార్టీలో అంతర్గత కలహాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. సీఎం యోగి పనితీరు వల్లే లోక్సభ ఎన్నికల్లో పెద్దగా రాణించలేక పోయామన్నది అక్కడి నేతల వాదన. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రావడానికి యూపీ కీలకంగా మారింది. ఈ క్రమంలో సీఎం యోగిని మార్చడం సరైన పద్దతికాదని అంటున్నారు. కాకపోతే ఉపఎన్నికల తర్వాత యోగి మంత్రివర్గాన్ని మార్చే అవకాశముందనే టాక్ లేకపోలేదు.
ALSO READ: భయపడ్డ సిద్ధరామయ్య సర్కార్.. ప్రైవేట్ జాబ్ కోటా బిల్ నిలిపివేత!!
మొత్తానికి లోక్సభ ఎన్నికలు బీజేపీలో చిన్నపాటి తుపాను చెలరేగిందనే చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి ఆ పార్టీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.