Promotions and Transfers in Telangana(TS news updates): రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతానికి నీటి పారుదల శాఖ రూట్మ్యాప్ రూపొందించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు 2025 డిసెంబర్ నాటికి ఆ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
పాలమూరు రంగారెడ్డితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతితోపాటు నిర్మించాల్సిన ప్రాజెక్టులపై బుధవారం జలసౌధలో నీటిపారుదల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, అదనపు కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా బేసిన్ పరిధిలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్, ఎస్ఎల్ బీసీ, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎల్ఐసీలతోపాటు గోదావరి బేసిన్ పరిధిలోని చిన్న కాళేశ్వరం, పాలెం వాగు, నిల్వాయి ప్రాజెక్టు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ ఫెజ్-2, లోయర్ పెన్ గంగా, చనాకా కోరాట, దేవాదుల, మోదీ కుంటవాగుతోపాటు పలు ప్రాజెక్టులపై చర్చించినట్లు మంత్రి చెప్పారు.
Also Read: తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు.. ఐఎండీ సూచనలివే
వీటిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులతోపాటు గోదావరి బేసిన్ పరిధిలోని మోదీకుంట, చిన్న కాళేశ్వరం, చనాక కోరాట, లోయర్ పెన్ గంగా, శ్రీపాద ఎల్లంపల్లితోపాటు పలు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ. ఎనిమిది వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేసినట్లు మంత్రి చెప్పారు. అయితే,అదే సమయంలో 2025 డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్న నిర్దేశిత లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖకు అదనంగా మరో రూ. 11 వేల కోట్ల బడ్జెట్ కావాలనే ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆర్థిక శాఖకు కూడా పంపాలని నిర్ణయించామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ. 28,000 కోట్లు నీటి పారుదల శాఖకు కేటాయిస్తే, అందులో గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో చేసిన అప్పుల వడ్డీ రూ. 18,000 కోట్లు అని, మరో రూ. 2 వేల కోట్లు జీతభత్యాలకు ఖర్చు అవుతున్నాయని ఉత్తమ్ తెలిపారు. అందుకే అదనపు బడ్జెట్ను సమీకరించుకుని సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి 6 లక్షలకు పైగా ఎకరాలు సేద్యంలోకి తేస్తామన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించామన్నారు. ఇప్పటికే పూర్తి కావొచ్చిన వాటిని ఏ కేటగిరీలోకి, ఆ తరువాత బీ కేటగిరీలోకి, ఆ తరువాత సీలుగా విభజించినట్లు ఆయన చెప్పారు. ఏ కేటగిరీలో రూ. 240.66 కోట్లతో 47,882 ఎకరాల ఆయకట్టును సేద్యంలోకి తీసుకొస్తామన్నారు. అదేవిధంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు సుమారు రూ. 7,500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో 5,84,770 ఎకరాల ఆయకట్టు భూమిని సేద్యంలోకి తీసుకొస్తామన్నారు. నిర్మల్ జిల్లా సదర మాట్ ప్రాజెక్టును జులై చివరి నాటికి, ఖమ్మం జిల్లాలో సీతారాం ప్రాజెక్టును ఆగస్టు 15న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖలో త్వరలోనే ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.