Telugu Language: ప్రాంతీయ రాజకీయాలతో సమాంతరం భాషా రాజకీయాలు కూడా దక్షిణాదిలో ఎక్కువగా జరిగాయి. ఇప్పటికీ ఉత్తరాది భాషలను దక్షిణాది రాష్ట్రాలు నిరాకరిస్తుంటాయి. భాషను కూడా తమ అస్తిత్వంలో ఒకటిగా ఇక్కడి ప్రజలు భావిస్తుంటారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో విద్య సముపార్జన, సన్నద్ధత కోసం ఆంగ్లాన్ని అంగీకరిస్తారు. కానీ, ఏ భాష అయినా బలవంతంగా రుద్దినట్టుగా భావిస్తే వెంటనే తిరస్కరిస్తారు. ఇక మాతృభాష పై ప్రేమ అసామాన్యంగా ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పద్ధతి కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో భాష, యాసలు కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. రైతు రుణమాఫీ మార్గదర్శకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది. తెలుగులో మార్గదర్శకాలను విడుదల చేయడం చాలా మందిని ఆకర్షించింది.
మాజీ ఉపరాష్ట్రపతి, వక్త, రచయిత, తెలుగు భాషలో అలవోకగా చమత్కారాలు విసిరే వెంకయ్యనాయుడును ఈ పరిణామం ఆకర్షించింది. ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరమని, ఎప్పటి నుంచో తాను ఈ సూచన చేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా మార్గదర్శకాలను తెలుగులో.. అందులోనూ రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను తెలుగులో జారీ చేయడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఇది ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని, రైతులు కూడా తమ కోసం జారీ చేసిన మార్గదర్శకాలను అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కాబట్టి, జారీ చేసిన మార్గదర్శకాలకు సార్థకత లభిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకు, ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇక నుంచి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన…
మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. https://t.co/WkGuotF8uK
— Revanth Reddy (@revanth_anumula) July 17, 2024
Also Read: రెండు ఫిలింపేర్ అవార్డులు అందుకున్న సాయిపల్లవి.. సెలబ్రేట్ చేసిన తండేల్ టీమ్
వెంకయ్యనాయుడు ప్రశంసపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేశామని, దీనిపై హర్షాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.