Dubai princess Sheikha Mahra: దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్కు ఇటీవలే సంతానం కలిగింది. తొలి సంతానం కలిగి రెండు నెలలు అవుతుంది. ఈ క్రమంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది.
ఇన్స్టాగ్రామ్లో ఆమె పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. ‘ప్రియమైన నా భర్త గారు ఓ విషయం తెలియజేస్తున్నా. మీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. దాని కారణం ఏమంటే.. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. ‘ఐ డెవర్స్ యూ.. టేక్ కేర్.. మీ మాజీ సతీమణి” అంటూ షైకా మహ్రా ఆ పోస్ట్లో పేర్కొన్నది.
అయితే, ఇదే సమయంలో దంపతులిద్దరూ కూడా ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. వారు కలిసి దిగిన ఫొటోలను కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని పలువురు.. షైకా అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ ఇంకొందరు చర్చించుకుంటున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ షైకాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: ట్రంప్ పార్టీ కార్యక్రమంలో కత్తులతో దాడి చేయబోయిన వ్యక్తి .. కాల్చి చంపిన పోలీసులు!
షైకా మెహ్రా.. దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కుమార్తె. బ్రిటన్లో ఉన్నత విద్యను అభ్యసించిన మెహ్రాకు దుబాయ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్తో వివాహం జరిగింది. వీరి వివాహం 2023, మే 27న జరిగింది.
సరిగ్గా ఏడాది తరువాత షైకా మెహ్రా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకమని పేర్కొంటూ భర్త, చిన్నారితో కూడిన ఫొటోను షేర్ చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకే ‘మనమిద్దరమే’ అని పేర్కొంటూ తన చిన్నారితో కూడిన మరో ఫొటోను షేర్ చేసింది. ఈ క్రమంలోనే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.