Tuticorin: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో తూత్తుకుడిలో రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చేసిన ఘటనకు సంబంధించిన పిటిషన్ విచారిస్తూ పోలీసులపై మండిపడింది. 2018లో ప్రజాందోళన తీవ్రతరమయ్యాక పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించారు. ఈ కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు చేసిన సీబీఐ తీరును ఆక్షేపించింది. ఆ పారిశ్రామికవేత్త కోసమే ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నామని చెప్పింది.
తూత్తుకుడిలో స్టెరిలైట్ పరిశ్రమ పనులు చేపడితే.. తమ జీవితాలు, తమ భావితరాలు దుర్భరమవుతాయని స్థానికులు ఆందోళనలు చేశారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్య కారకాలు తమ జీవితాలను ఛిద్రం చేస్తాయని ఆరోపించారు. ఆ పరిశ్రమను మూసేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు తీవ్రంగా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారినప్పుడు 2018 మే నెలలో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించారు.
ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం మూసేసిన కేసును తిరిగి ఓపెన్ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త హెన్రి తిఫాగ్నే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తులు ఎస్ఎస్ సుందర్, సెంథిల్ కుమార్ రామమూర్తిల డివిజన్ బెంచ్ విచారించింది. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగలేదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. పోలీసుల కాల్పులు ముందస్తుగా నిర్ణయించుకున్న చర్యగా తాము అనుమానిస్తున్నామని తెలిపింది. ఒక పారిశ్రామికవేత్త పక్షాన ఈ కాల్పులు జరిగాయని భావిస్తున్నామని పేర్కొంది.
Also Read: బీఆర్ఎస్లో మార్పులు, టీఆర్ఎస్ కండువాతో హరీష్రావు
అలాగే, రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టరేట్, యాంటీ కరప్షణ్ (డీవీఏసీ)కు ఈ డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో ఆందోళనలు జరిగినప్పుడు అక్కడ విధులు నిర్వర్తించిన ఐపీఎస్, ఐఏఎస్ సహా అధికారులందరి ఆస్తిపాస్తులను దర్యాప్తు చేయాలని ఆదేశించింది.