Revanthreddy: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన కుమార్తె వివాహ సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు. ఆ రోజు తనను అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. తన బిడ్డ లగ్నపత్రికకు కూడా పోకుండా కేసీఆర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఇంటికి సీబీఐ వస్తోందన్నారు. నాటి ఆ పాపం ఊరికే పోదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ మీ బిడ్డ ఇంటికి వస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుందన్నారు. ఆ బాధ మీకు ఇప్పుడు తెలుస్తుందా? అంటూ ప్రశ్నించారు. తమ ఉసురు తగులుతుందని మండిపడ్డారు.
రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ వికారాబాద్ కలెక్టరేట్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు కూడా తగులుతుందన్నారు. తాండూరు ఎమ్మెల్యేను కొనుగోలు చేసింది ఎవరని ప్రశ్నించారు. 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కేసీఆర్ కదా? అని నిలదీశారు. కాంగ్రెస్ లేకుండా చేస్తే కేసీఆర్ కు ఆయన కొడుక్కి ఎదురు ఉండదని అనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను మోసం చేసిన పాపం ఊరికే పోదన్నారు.