Modi social media followers increased but voters decreased
సామాజిక మాద్యమాలలో మోదీ క్రేజ్ మామూలుగా లేదు. ఏకంగా కోటికి పైగా ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. ఇది చూసి బీజేపీ శ్రేణులు సంబరపడిపోతున్నారు. తమ నేతకు ఏ మాత్రం హవా తగ్గలేదని..మోదీయే నెంబర్ వన్ నేత అని తెగ ఫీలయిపోతున్నారు. అక్కడి దాకా బాగానే ఉంది.మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో మాత్రం ఓటింగ్ శాతం బాగా తగ్గిపోయింది. 400 సీట్లు మెజారిటీ అని ఊదరగొట్టిన బీజేపీ నేతలు చివరకు సొంతంగా మెజారిటీ సాధించలేక సంకీర్ణ ప్రభుత్వంగా మిగిలిపోవాల్సి వచ్చింది. గత రెండు పర్యాయాల కన్నా మోదీకి వారణాసిలో తక్కువ శాతం ఓట్లు వచ్చాయి.
సోషల్ మీడియాలో ఎలన్ మస్క్ తర్వాత మోదీ ఆ స్థానాన్ని ఆక్రమించారు ఎక్కువ మంది ఫాలోవర్స్ లో.
అయితే సోషల్ మీడియాలో దీనిపై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. ఫాలోవర్స్ పెరిగిన మాట వాస్తవమే అయివుండవచ్చు. మరి అదే సోషల్ మీడియాలో ఇటీవల కొందరు అడిగే ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెప్పలేక దాటవేస్తున్నారు. ఒక్కో సందర్భంలో మోదీని అభ్యంతరకరమైన ప్రశ్నలడిగేవారి ఖాతాలను బ్లాక్ చెయ్యడానికి సైతం వెనకాడటం లేదు మోదీ సోషల్ మీడియా ఆర్మీ.
నెటిజన్స్ ప్రశ్నలకు సమాధానమేది?
మణిపూర్ అంశంపై ప్రతి రోజూ మోదీపై నెటిజనులు ప్రశ్నలు సంధిస్తునే ఉన్నారు. ఇటీవల మణిపూర్ ప్రాంతాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించిన విషయాన్ని గుర్తుచేస్తూ మోదీ అక్కడికి ఎందుకు వెళ్లలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. మణిపూర్ అంశాన్ని మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం పట్టించుకోనట్లు ప్రవర్తిస్తోంది. మణిపూర్ అల్లర్లను పట్టించుకోక లైట్ గా తీసుకుంటూ వస్తున్నారు. కానీ అక్కడ దాదాపు సైన్యం నీడలో మణిపూర్ ప్రజలు నరకయాతన పడుతున్నారు. దాదాపు ఇంటర్నెట్ లేకుండా చేస్తున్నారు. బలవంతంగా అక్కడ జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని బీజేపీ అణిచివేస్తోంది. అయినా ఈ విషయంలో బీజేపీ ఏ మాత్రం తగ్గడం లేదు. మణిపూర్ ప్రజల హక్కులను కాలరాస్తూ అక్కడ ప్రజలకు ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీని సోషల్ మీడియాలో ప్రశ్నించేవారిని మ్యూట్ చేస్తున్నారు.
సంవిధాన్ హత్యా దివస్
పైగా ఇటీవల మోదీ జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్ గా ఎమర్జెన్సీ డేని జరుపుకుందాం అని ప్రకటించారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ గత నెల 25తో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సంవత్సరం సంవిధాన్ హత్యా దివస్ గా జరుపుకుందాం అని ప్రకటించగానే బీజేపీ శ్రేణులు సంతోషంగా తమ ఆమోదం తెలిపాయి. మరి మణిపూర్ లో జరుగుతున్నదేమిటి? ఎమర్జెన్సీ కాదా అని ఓ నెటిజన్ అడిగిన నేరానికి అతని అకౌంట్ బ్లాక్ చేశారు.
మణిపూర్ ఇష్ష్యూ పై మౌనమెందుకు?
మణిపూర్ ఇష్ష్యూపై నెటిజనుల ప్రశ్నలకు మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలా ప్రశ్నించిన ప్రతి ఒక్కరి అకౌంట్ బ్లాక్ చేస్తూ వెళ్లడంలో అర్థం ఏమిటని మోదీని నిలదీస్తున్నారు. మొన్నటి నీట్ పరీక్షల నిర్వహణ తీరుపైనా చాలా మంది మోదీని టార్గెట్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని..ఈ విసయంలో మోదీ ఏం చేస్తున్నారంటూ చాలా మంది నిరుద్యోగ విద్యార్థులు మోదీ ఎక్స్ ఖాతాలో ట్రోలింగులు చేయడం మొదలుపెట్టారు. గతేడాది రైతు ఉద్యమం సమయంలోనూ రైతులకు జరుగుతున్న అన్యాయంపై మోదీకి చాలా పోస్టులే చేశారు. ఈ విషయంలో మోదీ అండ్ కో ఒకటి గుర్తుంచుకోవాలి. నెటిజన్లను పెంచుకోవడం కాదు..వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఉండాలని అంటున్నారు. ఓటర్ల మనసులు గెలుచుకోగలిగితేనే ఈ సారి మోదీ ప్రభుత్వానికి మనుగడ అంటున్నారు.