CM Chandrababu focus on nominated posts(AP political news): టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం నెల కొంది. ఈ నెలలో కొన్నింటిని భర్తీ చేయాలని టీడీపీ ఆలోచన చేస్తోంది. మూడు పార్టీల నేతలకు ఇందులో స్థానం కల్పించాలని భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ ప్రక్రియ చేపట్టనుంది. గతంలో మాదిరి గా జంబో కార్పొరేషన్ల పదవులు కాకుండా రెండొంతులకు పరిమితం చేయాలన్నది పార్టీ ఆలోచనగా నేతలు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 90 పైచిలుకు కార్పొరేషన్ల పోస్టులు పంపకాలు జరిగాయి. ప్రతీ కమ్యూనిటీకి ఒకటి చొప్పున కేటాయించారు. పదవులైతే ఇచ్చారుగానీ.. వారికి ఆఫీసు ఎక్కడుందో తెలియని పరిస్థితి. దీన్ని గమనించిన ప్రస్తుతం టీడీపీ సర్కార్, వాటిని కుదించాలనే నిర్ణయానికి వచ్చింది. కేవలం రెండు వంతుల పోస్టులకు వాటిని పరిమితం చేయనున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
నామినేటెడ్ పోస్టులను మూడు పార్టీల నేతలకు కేటాయించాలనేది అందులోని సారాంశం. 60 కార్పొరేషన్ల పోస్టులకు టీడీపీకి 45, జనసేనకు 10, బీజేపీ ఐదు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య చిన్నపాటి చర్చ జరిగిందని తెలుస్తోంది. పవన్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయట. ఈ వ్యవహారంపై ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ప్రస్తావించినట్టు వినికిడి.
ఈ లెక్కన అసెంబ్లీ సమావేశాలు తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ కానున్నాయి. టీడీపీలో ఆయా పోస్టు లు ఎవరికి ఇవ్వాలనే దానిపై కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించింది. జిల్లాల్లో ముఖ్యనేతలు తమ వారసులకు పదవులు ఇప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరికొందరు నమ్మిన బంటుల కోసం యువనేత, మంత్రి నారా లోకేష్తో మంతనాలు మొదలుపెట్టారు.
ALSO READ: మనసు మార్చుకున్న జగన్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు!
పదవుల విషయంలో సీఎం చంద్రబాబు ఆలోచన మరోలా ఉందన్నది నేతల మాట. గతంలో ఉన్న నేతలు ఇప్పుడున్నారని, కొత్తగా లీడర్ షిప్ బిల్డ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట. అందుకోసమే యువకుల పై ఫోకస్ పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందిపడిన నేతలపై ఆరా తీస్తున్నారు. పార్టీ కోసం పోరాటం చేసినవారిని, దిగువస్థాయి కార్యకర్తలతో అనుసంధానమైన వారి జాబితా రెడీ అయినట్టు సమాచారం.