Bangladesh Job Reservations: బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విధానం మార్చాలని రాజధాని ఢాకాలో నిరసనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. దీంతో విద్యార్థులు కూడా పోలీసులకు ఎదురుతిరిగి రాళ్లు రువ్వారు. ఈ హింసాత్మక ఘటనలో ఆరుగురు చనిపోగా.. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజధాని ఢాకాతో సహా పలు నగరాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులు.. గత కొన్నిరోజులుగా నిరసనలు చేస్తున్నారు. దీని వల్ల
బుధవారం ఉదయం పోలీసులు మీడియాతో ఢాకా, చట్ గావ్, రంగ్ పూర్ నగరాల్లో మొత్తం ఆరుగురు చనిపోయారని, నాలుగు వందల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఈ నిరసనలతో దేశంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు రెండు రోజులుగా సెలవు ప్రకటించాయి.
పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోసం పోరాడిన ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే మహిళలు, మైనారిటీలు, వికలాంగుల కోటా ఉండగా… ఈ కొత్త రిజర్వేషన్ విధానం పెట్టడం వల్ల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విద్యార్థి సంఘాల వాదన.
బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ ఉండగా.. అందులో సగం రిజర్వేషన్లకే కేటాయించడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ లో స్వాతంత్ర్య ఉద్యమకారుల కుటుంబాల కోసం రిజర్వేషన్లు చాలా కాలంగా ఉన్నాయి. కానీ 2018లో ప్రధాని మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది.
అయితే జూన్ 2024లో బంగ్లాదేశ్ కోర్టు.. ఉద్యమకారుల కుటుంబాలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో ప్రభుత్వం తిరిగి రిజర్వేషన్ల విధానం అమలు పరుస్తుందని ప్రకటన రావడంతో విద్యార్థి సంఘాలు రోడ్డున నిరసనలు చేపట్టారు.
ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నది బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ అనే విద్యార్థి సంఘం. ప్రస్తుతం అధికారంలో ఉన్న షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి ఈ విద్యార్థి సంఘం అనుబంధంగా పనిచేస్తోంది. అందువలన ఈ నిరసనలు అధికార పార్టీ అండదండలతోనే జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
మరోవైపు ప్రతిపక్ష కూటమి అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతె ఇస్లామి పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు.. నిరసనకారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఇవ్వడమే కరెక్ట్ అని వారి వాదన. ఈ క్రమంలో రెండు విద్యార్థి సంఘాల నిరసనకారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే నిరసన చేసే విద్యార్థులు పోలీసులపై ఎదురు దాడి చేశారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి అనిసుల్ హఖ్ మాట్లాడుతూ.. ”శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన విద్యార్థులు రాళ్లు విసిరారు.. వారి వల్లే ఈ హింస చెలరేగింది. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర,” అని మండిపడ్డారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ నాయకుడు రాహుల్ కబీర్ రిజ్వి మాట్లాడుతూ.. ”ఈ నిరసనలు వారం రోజులుగా జరుగుతున్నాయి. రాజధాని సహా చాలా నగరాల్లో ఈ నిరసనల వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది.” అని అన్నారు.
ఇప్పటికే రిజర్వేషన్ల అమలు వ్యతిరేకంగా కోర్టులో విద్యార్థి సంఘాలు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ విచారణ ఆగస్టు 7న జరుగనుంది.
ఈ హింసాత్మక ఘటనలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జెనెరల్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు. నిరసనకారులపై ఎటువంటి దాడి జరగకుండా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.