Supreme Court BIG Shock To KCR: కమిషన్ను వద్దన్నారు.. రద్దు చేయాల్సిందే అన్నారు. తాను విచారణకు వచ్చేది లేదు.. కనీసం లెటర్ కూడా రాసేది లేదన్నారు. హైకోర్టులో పోరాడారు.. ఓడారు.. ఆఖరికి దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వరకు వెళ్లి మరి తగ్గేది లేదన్నారు. కానీ తీరా ఏమైంది. అక్కడే అదే అనుభవం ఎదురైంది. ఇంతకీ విద్యుత్ కమిషన్ రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చేసిన మార్పులేంటి? వాటి వెనక రీజన్సేంటి? ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్తేంటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొనుగోళ్లు. పవర్ ప్లాంట్ల నిర్మాణల్లో ఎన్నో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇదంతా మనకు తెలిసిందే.. ఈ కమిషన్ను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసి భంగపడ్డారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన అదే సీన్ రీపిట్ అయ్యింది. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ వాదనలు జరిగాయి.
ఇది పూర్తిగా రాజకీయ కక్షతో వేసిన కమిషన్.. రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన ప్రతిసారి మాజీ సీఎంలపై కేసులు నమోదు చేస్తున్నారు. కమిషన్ నియామకంలో ప్రభుత్వం పరిధిని మించి పనిచేసింది. ట్రిబ్యూనల్స్ ఉండగా.. కొనుగోలు ఒప్పందాలపైఎలా న్యాయ విచారణ చేస్తారు. ఇది పూర్తి కక్ష సాధింపు చర్యే.. ఈ ఆర్సీ ఉండగా.. మళ్లి విచారణ కమిషన్ అవసరం లేదు. విచారణ పూర్తి కాకముందే ప్రెస్మీట్ పెట్టి నర్సింహరెడ్డి కేసీఆర్ను దోషి అంటూ తేల్చేశారు. ఇలా కేసీఆర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా న్యాయవాదులు గట్టిగానే వాదించారు. ప్రెస్మీట్లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారు. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తుంటే భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. దీంతో ప్రభుత్వ ఖాజానాపై భారం పడింది.
కమిషన్ను రద్దు చేయాలని కోరే అధికారం కేసీఆర్కు లేదు. చాలా మందితో పాటే కేసీఆర్కు నోటిసులు ఇచ్చారు. ఇలా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు న్యాయవాదులు.
సుప్రీంకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్నది. కమిషన్ విచారణ సరైనదే అని తేల్చి చెప్పింది. కానీ జస్టిస్ నర్సింహరెడ్డి స్థానంలో మరోకరిని నియమించాలని మాత్రం ఆదేశించింది. అయితే జస్టిస్ నర్సింహరెడ్డిపై తమకు ఎలాంటి అపోహలు లేవని.. కానీ న్యాయం జరిగినట్టు కనిపించడం కోసమే ఈ మార్పు చేపడుతున్నట్టు తెలిపింది. కానీ జూన్11న కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్మీట్ పెట్టడంపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ దశలో ప్రెస్ మీట్ పెట్టడం.. అభిప్రాయం వ్యక్తపరచడం.. సరైంది కాదని తెలిపింది. కాబట్టి.. ఇప్పుడు విద్యుత్ కమిషన్కు కొత్త చీఫ్ రాబోతున్నారు.
Also Read: అదిరిపోయే పథకం..అందరికీ ఆరోగ్యం
అంతేకాదు విద్యుత్ కొనుగోళ్లపై జ్యూడిషియల్ విచారణ అనకుండా.. ఎంక్వైరీ కమిషన్గా వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. కేసీఆర్ పిటిషన్ను కూడా డిస్మిషన్ చేసింది సుప్రీంకోర్టు. దీంతో ఆయనకు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లినా షాక్ మాత్రం తగలడం మాత్రం ఆగలేదని తెలుస్తోంది. కాబట్టి.. ఇప్పుడేం జరుగుతుంది? ఇన్నాళ్లు కమిషన్ విచారణకు నై అంటున్న కేసీఆర్.. ఇక సై అనాల్సిందే. కమిషన్ అడిగే సమాచారం ఇవ్వాల్సిందే. అవసరమై ఆదేశిస్తే విచారణకు హాజరు కావాల్సిందే.. చేసిన పనులు.. తీసుకున్న నిర్ణయాలు.. ఇలా అన్ని చెప్పాల్సిందే.. ఇవైతే తప్పవు.
నిజానికి ఇక్కడ ఓ విషయం అర్థం కావడం లేదు. అదేంటంటే విద్యుత్ కమిషన్ అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు. నిజానికి అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ నేతలు సవాల్ చేశారు. తాము ఎలాంటి అక్రమాలు చేయలేదు. ఏ విచారణకైనా సిద్దమే అని సవాల్ చేశారు. ఈ సవాల్తోనే రేవంత్ రెడ్డి సర్కార్ జ్యూడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. తీరా ఇప్పుడేమో అసలు కమిషన్నే రద్దు చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నారు కేసీఆర్. అందుకే ఇందులో అసలు మతలబేంటో అర్థం కావడం లేదు. కొత్త జడ్జి నియామకం తర్వాతైనా అసలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అసలు మతలబేంటో బయటికి వస్తుందేమో చూడాలి.