Prajwal Revanna’s Father Comments in Assembly: ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ అంశం అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. డీజీపీ అలోక్ మోహన్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఆ పదవికి ఆయన అనర్హుడంటూ మండిపడ్డారు.
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలపై కూడా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఈ రెండు కేసులకు సంబంధించి సిట్ వ్యవహరిస్తున్న తీరును ఉద్దేశిస్తూ ప్రతిపక్ష నేత అశోక అసెంబ్లీలో లేవనెత్తారు. ఈ క్రమంలో హెచ్డీ రేవణ్ణ తన కుమారుడి గురించి మాట్లాడారు.
‘నా కొడుకు నిజంగానే తప్పు చేసి ఉంటే అతడిని ఉరి తీయండి. అందుకు నేను ఏ మాత్రం అడ్డు చెప్పబోను. అలాగని నా కుమారుడిని సమర్థించడానికో.. లేదా ఆ అంశంపై చర్చించడానికో నేను ఇక్కడికి రాలే. సభలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినందున నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎవరో ఓ మహిళను డీజీపీ ఆఫీసుకు తీసుకువచ్చి ఆమెతో ఆరోపణలు చేయించారు. అనంతరం ఫిర్యాదు తీసుకున్నారు. అలాంటి వ్యక్తి డీజీపీగా ఉండేందుకు అనర్హుడని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు కూడా లేదు’ అంటూ ఆయన విమర్శించారు.
Also Read: పూజా ఖేడ్కర్కు భారీ షాక్.. ఐఏఎస్ ట్రైనింగ్ నిలుపుదల
అయితే, ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ సీఎం సిద్ధరామయ్య.. స్పీకర్ ను కోరారు. డీకే శివకుమార్ కూడా స్పందిస్తూ.. అధికారులను దూషించిన హెచ్డీ రేవణ్ణకు నోటీసులు ఇవ్వాలన్నారు. అదేసమయంలో తనకు అన్యాయం జరిగిందని భావిస్తే చర్చకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన కోరారు.
కాగా, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ లు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజ్వల్ పై నాలుగు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జీడీఎస్ పార్టీ అతడిపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. హసన్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రజ్వల్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే.. బాధిత మహిళను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై రేవణ్ణ, ఆయన భార్య భవానీ కూడా అరెస్టయ్యారు. ఆ తరువాత వారు బెయిల్ పై బయటకు వచ్చారు.