Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విభజన హామీలు అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రిని సీఎం కోరినట్టు తెలిసింది. అలాగే.. పోలవం ప్రాజెక్టు అంశాన్ని కూడా చర్చించినట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సీఎం చంద్రబాబు వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టు చేరగానే కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు సహా పలువురు ఘన స్వాగతం పలికారు. అనంతరం, సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్టు నుంచి నేరుగా 50 అశోక్ రోడ్డులోని అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అక్కడ రాత్రి 9.30 గంటలకు ఆయనతో భేటీ అయ్యారు.
Also Read: సీఎంపై గవర్నర్ పరువు నష్టం దావా.. కోర్టు తీర్పు ఏమిటంటే?
మంగళవారం రాత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే బస చేస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్లను కలవనున్నారు. మరికొందరు కేంద్రమంత్రులతోనూ చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్లు ఖరారైనట్టు తెలిసింది. ప్రధాని, కేంద్రమంత్రులతో భేటీలో ఏపీకి ప్రత్యేక సాయం కోరే అవకాశం ఉన్నది. ఈ నెల 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ఏపీకి, బిహార్కు ప్రత్యేక సాయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా ఈ డిమాండ్ను ప్రముఖంగా వారి ముందు వినిపించనున్నట్టు తెలుస్తున్నది.
రెండు వారాల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు నాయుడు రెండో సారి ఢిల్లీకి పయనం కావడంతో ఈ పర్యటనకు అధిక ప్రాధాన్యత ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతున్నదని చెబుతున్నారు.