CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని సీఎం మమతా బెనర్జీని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను కోర్టు విచారించి దీదీకి ఆదేశాలు జారీ చేసింది. అసలు గవర్నర్ ఎందుకు పరువు నష్టం దావా వేశారనేది తెలుసుకుందాం.
రాజ్భవన్లో పని చేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగిని గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో మే నెలలో కోల్కతా పోలీసులు గవర్నర్ పై దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ మహిళ సీఎంను కలిసి మాట్లాడారు. ఆ తర్వాత మమతా బెనర్జీ రాజ్భవన్ గురించి పరుషంగా మాట్లాడారు. ఆ మహిళలు రాజ్భవన్కు వెళ్లాలంటే భయపడుతున్నారని, అక్కడ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు వారిలో భయాందోళనలను నింపాయని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.
మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే జూన్ 28వ తేదీన గవర్నర్ సీవీ ఆనంద బోస్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్కు వ్యతిరేకంగా అభ్యంతరకర, అవాస్తవ వ్యాఖ్యలు చేయకుండా సీఎం మమతా బెనర్జీని కట్టడి చేయాలని కోర్టులో డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు. కోర్టు ఈ కేసును విచారించింది. సీఎం మమతా బెనర్జీ, ఇటీవలే ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు,మరో టీఎంసీ నాయకుడు గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని గవర్నర్ తరఫు కౌన్సిల్ వాదించారు. ఆరోపిత ఘటనపై మరే వ్యాఖ్యలు చేయరాదని కోరారు.
Also Read: డ్రంకన్ డ్రైవ్తోపాటు డ్రైవ్ ఆన్ డ్రగ్ టెస్టు కూడా..
కాగా, సీఎం మమతా బెనర్జీ ఆమె చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని, కేవలం ఆమెకు చెప్పిన మహిళల బాధను మాత్రమే ఆమె వ్యక్తపరిచారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అవసరమైతే బాధిత మహిళల పేర్లను కూడా తాము అఫిడవిట్లో రాసి దాఖలు చేయగలమని వివరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం పదవిలో ఉన్న గవర్నర్ పై ఎలాంటి నేరపూరిత విచారణ చేపట్టకూడదు.
అయితే, జులై 4వ తేదీన బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించి గవర్నర్కు గల ఈ రక్షణను సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించే పరిధి కలకత్తా హైకోర్టుకు లేదని సీఎం తరఫు న్యాయవాది వాదించారు. కాగా, గవర్నర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరాదని సీఎం మమతా బెనర్జీకి పరిమితులు విధించింది.