Israeli airstrike has killed 17 Palestinians in a Gaza safe zone: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి బాంబుల దాడి చేసింది. ఈ దాడుల్లో ఒక్కరాత్రే 60 మంది పాలస్తీనీయన్లు మృతిచెందారు. సురక్షిత జోన్ గా ప్రకటించిన ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ వదలడంలేదు. గాజా ఆరోగ్య విభాగం తాజాగా స్పందించింది. సేఫ్ జోన్ లో 17 మంది పాలస్తీనీయన్లు మృతిచెందినట్లు వెల్లడించింది.
అయితే, దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్ శివారులోని మువాసీ ప్రాంతాన్ని సేఫ్ జోన్ గా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులతో ఇక్కడ ఆశ్రయం పొందేందుకు వచ్చిన వేలాదిమంది శరణార్థులు ఈ ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. ఐడీఎఫ్ కూడా ఈ ప్రాంతాన్ని తమ సేఫ్ జోన్ జాబితాలో చేర్చినట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. నిరాశ్రాయులు ఇక్కడే ఉండొచ్చంటూ వారికి సూచించింది. ఓ గ్యాస్ స్టేషన్ కు సమీపంలో ఏర్పాటు చేసుకున్న గుడారాలపై కూడా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది.
Also Read: అమెరికాలో కాస్పర్స్కై దుకాణం బంద్.. ఈనెల 20 చివరిరోజు
ఇందుకు సంబంధించి ఖానా యూనిస్ లోని నాజర్ ఆసుపత్రి వర్గాలు పలు వివరాలు వెల్లడించాయి. సేఫ్ జోన్ లోనే 17 మంది మృతిచెందినట్లు పేర్కొన్నాయి. దీంతో ఒక్క రాత్రిలో జరిగిన దాడుల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 60కు చేరుకుందని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. ఇదే ప్రాంతంలో శనివారం జరిపిన దాడిలో 90 మంది పాలస్తీనీయన్లు మృతిచెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే, ఈ విధంగా సురక్షిత ప్రాంతంలో దాడులు జరపడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.