Roja at Murugan Temple: హీరోయిన్గా తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఎందరో అభిమానులను సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో ఉంటూనే బుల్లితెరలో కొన్ని కార్యక్రమాల్లో తళుక్కుమని మెరిశారు. రాజకీయాలు కూడా కలిసి రావడంతో నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా వైసీపీ హయాంలో మంత్రిగా కూడా చేశారు. వైసీపీ హయాంలో ఆమె రాజకీయంగా ఉచ్ఛ స్థితికి వెళ్లారు. అయితే.. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రోజా పరాజయం పాలయ్యారు. దీంతో ఆమె చాలా వరకు మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. టీవీ షోస్లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. కానీ, ఒకప్పటి హీరోయిన్ కాబట్టి, ఇప్పటికీ ఆమెకు ఆదరణ ఉన్నది. మన రాష్ట్రంలోనే కాదు.. పొరుగు రాష్ట్రాల్లోనూ రోజాకు మంచి అభిమానులు ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే.. ఆమె తమిళనాడులోని ఓ ఆలయంలో దైవ దర్శనానికి వెళ్లగా అక్కడ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అందరికీ తగిన సమయం కేటాయిస్తూ ఓపికగా సెల్ఫీలకు పోజులు ఇచ్చిన రోజా.. ఆలయంలోని పారిశుధ్య కార్మికులను మాత్రం ఆమడ దూరంలోనే ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పారిశుధ్య కార్మికులపట్ల ఆమె తీరు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఆమె ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని తిరుచెండూర్లో గల మురుగన్ ఆలయానికి రోజా తన భర్త ఆర్కే సెల్వమణితో కలిసి వెళ్లారు. ఆ దంపతులకు ఆలయ సిబ్బంది, పురోహితులు ఘనస్వాగతం పలికారు. వారి దైవదర్శనం కూడా నిర్విఘ్నంగా జరిగింది. అయితే, వారు ఆలయం చేరింది మొదలు అభిమానులు వారి చుట్టూ గుమిగూడారు. దైవదర్శనం తర్వాత సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. ఆలయ సిబ్బంది సహా.. తోటి భక్తుల్లోనూ చాలా మంది ఆమెతో సెల్ఫీ దిగడానికి ఆసక్తి చూపించారు. ఆమె కూడా ఓపికగా వారితో సెల్ఫీలు దిగింది.
Also Read: పవర్ కమిషన్ చైర్మన్గా తప్పుకుంటున్నా.. జస్టిస్ నరసింహారెడ్డి లేఖ
ఇదే క్రమంలో ఆలయంలో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్న ఇద్దరు మహిళలు రోజాతో సెల్ఫీ దిగడానికి ముందుకు వచ్చారు. రోజాకు దగ్గరగా వారు వస్తుండగా.. ఆమె వారిని వారించారు. తనకు దగ్గరగా రావొద్దని సైగ చేశారు. దీంతో ఆ ఇద్దరు మహిళలు కొంత దూరంగానే నిలిచి సెల్ఫీ తీసుకుని వెళ్లిపోయారు. ఈ పరిణామంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందరితో సెల్ఫీలు దిగిన రోజా.. పారిశుధ్య కార్మికులను ఎందుకు దూరంగా ఉంచారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వారేమైనా అంటరానివారా? అంటూ నిలదీస్తున్నారు. అందరినీ సమానంగా చూడాల్సిందని మరికొందరు రోజా ప్రవర్తనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.