Justice Narsimha Reddy: మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యుత్ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ను రద్దు చేయలేమని, కానీ, కమిషన్ చైర్మన్ను మార్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నట్టు సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు నేపథ్యంలో పవర్ కమిషన చైర్మన్గా తప్పుకుంటున్నట్టు జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ కూడా విడుదల చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం వంటి వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు కమిషన్ వేసింది. జస్టిస్ నర్సింహారెడ్డి ఆ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైద్యరంగ నిపుణులు, అధికారులు సహా మాజీ సీఎం కేసీఆర్కు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలకు కూడా జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ లేఖలు రాసింది. ఈ వ్యవహారానికి సంబంధించి వారికి తెలిసిన వివరాలను అందించాలని కోరింది. పవర్ కమిషన్ నుంచి లేఖ అందుకున్న మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 12 పేజీల లేఖతో కమిషన్ పైనే ఆరోపణలతో విరుచుకుపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్కు చట్టబద్ధత లేదని, తనను దర్యాప్తునకు పిలిచే అధికారం ఆ కమిషన్కు లేదని కేసీఆర్ ఆరోపించారు. దర్యాప్తు పూర్తికాక ముందే కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారని, నేరమేమీ రుజువు కాకముందే తన పేరును ప్రస్తావించారనీ పేర్కొన్నారు. కాబట్టి, ఈ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ముందు నుంచే తనను దోషిగా చూపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తూ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు.
తొలుత హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేయగా.. డిస్మస్ అయింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారిస్తూ కమిషన్ను మార్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తపరిచింది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ నరసింహారెడ్డి ఈ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.
Also Read: కవితకు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ తరలింపు
జస్టిస్ నరిసంహారెడ్డి ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. మీడియా సమావేశంపై తాను ఇది వరకే తన అభిప్రాయాన్ని వెల్లడించానని తెలిపారు. బీఆర్కే భవన్లో ఏడో అంతస్తులో తమ ఆఫీసు, ఎనిమిదో అంతస్తులో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆఫీసు ఉన్నదని, ప్రతి రెండు రోజులకు ఒక సారి దాదాపుగా ఇక్కడ విలేకరుల సమావేశం జరిగేదని వివరించారు. తాము మీడియా సమావేశం నిర్వహించకుంటే విలేకరులు ఊహాత్మక కథనాలను ప్రచురించేవారని, అందుకే అలాంటి వాటిని అడ్డుకోవడానికి విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు, సాధించిన పురోగతి గురించి మీడియాకు వివరించామని పేర్కొన్నారు. ఇక కమిషన్ విచారణను బహిరంగంగా నిర్వహించాలని అనుకుందని, అందుకే వివరాలు సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. ఇక చివరి మాట, ఒక న్యాయమూర్తి, లేదా మాజీ న్యాయమూర్తి తాను పక్షపాతం వహించలేదని చెప్పే పరిస్థితి రావడం బాధాకరమని, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ కార్యాలయం ప్రతిష్ట కోల్పోతుందని వివరించారు. అందుకే హుందాగా పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాని పేర్కొంటూ లేఖ ముగించారు.
మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరికీ నోటీసులు పంపలేదని, కేవలం లేఖలు మాత్రమే రాశానని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఆ లేఖల్లోనూ ఎవరినీ దోషులుగా పేర్కొనలేదని, తన అభిప్రాయాన్నీ ప్రస్తావించలేదని వివరించారు. అయితే, మీడియాలో వచ్చిన ఆరోపణలు, నిరాధార, అవాస్తవ వార్తలను ఖండించి వివరణ ఇవ్వడానికే మీడియా సమావేశం నిర్వహించానని చెప్పారు. అందులోనూ తాను ఎక్కడా తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు.