Bandi Sanjay: కరీంనగర్ నుంచి రెండో సారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్కు మోదీ కేబినెట్లో చోటు దక్కింది. అదే కరీంనగర్ నుంచి గతంలో ఎంపీగా గెలిచిన.. ప్రస్తుతం హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్కు చెందిన వీరిద్దరూ కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ బిడ్డగా ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్రమంత్రి బండి సంజయ్కు బహిరంగ లేఖ రాశారు.
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కుమార్కు అభినందనలు తెలుపుతూ.. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్కు సరిపడా నిధులు రాబట్టడానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి, తద్వార రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశించారు.
రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురావడంలో కేంద్రమంత్రిగా బండి సంజయ్ కీలక పాత్ర పోషించాలని మంత్రి పొన్న సూచించారు. రాష్ట్ర మంత్రిగా, కరీంనగర్ బిడ్డగా చాలా కాలం నుంచి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్లో ఉన్న నిధుల గురించి ఇక్కడ చర్చించదలిచానని పేర్కొన్నారు. ఆ పెండింగ్ అంశాల వివరాలను ఆయన ఏకరువుపెట్టారు.
1. నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని స్థాపించడం
2. మిడ్ మానేర్, గౌరవెల్లి నిర్వాసిత కుటుంబాలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడం
3. శాతవాహన యూనివర్సిటీకి రూ. 200 కోట్లు అందించడం
4. కరీంనగర్, తిరుపతిలకు మధ్య రైల్వే రూట్ డబ్లింగ్ వేగవంతం చేయాలి
5. కరీంనగర్, షిరిడిల మధ్య రైల్వే రూట్ డబ్లింగ్ వేగవంతం చేయాలి
6. హుస్నాబాద్కు మెడికల్ కాలేజీని మంజూరు చేయాలి
7. కొత్తపల్లి, జనగాం జాతీయ రహదారి మంజూరు చేయాలి
8. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
9. వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
10. ఎన్ఎలఎం, పీఎంఈజీ, ఎన్హెచ్ఎం స్కీమలకు సరిపడా బడ్జెట్ కేటాయింపులు జరపాలి.
బండి సంజయ్ కేంద్రమంత్రి అయ్యాక రాష్ట్రంలోని కీలక రాజకీయ నేతలు ఆయనకు బాధ్యతలు పెంచుతున్నారు. ఆయనపై ఉన్న బాధ్యతలను గుర్తు చేస్తూ బహిరంగ లేఖలు రాస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు ముందు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. కేంద్రమంత్రి బండి సంజయ్కు బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల నేతన్నలకు న్యాయం చేసేలా, కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖపై బండి సంజయ్ స్పందిస్తూ కేటీఆర్ పై విమర్శలు చేశారు.