puja khedkar’s IAS training put on hold: ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ కు భారీ షాక్ తగిలింది. ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రలో ఆమె ట్రైనింగ్ ను నిలిపివేశారు. ఈ మేరకు ముస్సూరిలోని లాల్ బహదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రీకాల్ ఉత్తర్వులను జారీ చేసింది. పలు వివాదాలకు ఆమె కేంద్ర బిందువుగా మారడంతో ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అడ్డదారుల్లో ఆమె ఐఏఎస్ ఉద్యోగం పొందారంటూ ఆరోపణలు వస్తున్న క్రమంలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆమె ట్రైనింగ్ ను నిలుపుదల చేసి తిరిగి ముస్సూరిలోని లాల్ బహదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికయ్యేందుకు వైకల్యం, ఓబీసీ సర్టిఫికేట్లను తారుమారు చేసిందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పూజా ఖేడ్కర్ శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నది. అవసరమైన తదుపరి చర్యల నిమిత్తం ఖేడ్కర్ ను జులై 23లోగా అకాడమీకి రావాల్సిందిగా పేర్కొన్నది.
Also Read: కాంచన్జంగా రైలు ప్రమాదానికి కారణం ‘వాకీ-టాకీల కొరత’..?
అయితే, ఐఏఎస్ ఉద్యోగంలో చేరేందుకు ఆమె తప్పుడు పత్రాలు సమర్పించినట్లు భారీగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. 2018, 2021లో అహ్మద్ నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ అందించిన రెండు సర్టిఫికెట్లను బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ కేటగిరీ కింద యూపీఎస్సీకి పూజా ఖేడ్కర్ సమర్పించింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆమెను ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. కానీ, ఆమె మాత్రం ఏప్రిల్, 2022 నుంచి ఆగస్టు వరకు ఆరుసార్లు మెడికల్ టెస్టులకు వెళ్లలేదు.