Kanchanjunga Express Accident: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంచన్జంగా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన రైల్వే సేఫ్టీ కమిటీ(సీఆర్ఎస్).. రైళ్లు ఢీకొనడానికి గల కారణాలను బయటపెట్టింది. జూన్ 17వ తేదీన ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు లోకో పైలట్ తోపాటు 10 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సీఆర్ఎస్ పలు సూచనలు చేసింది. ఆటోమేటిక్ రైలు – రక్షణ వ్యవస్థ(కవాచ్) అమలు చేసేందుకు సిఫార్సు చేసింది. ఆటోమేటిక్ సిగ్నల్ జోన్ లలో విధులు నిర్వహిస్తున్న లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలంటూ సూచించింది. గూడ్స్ రైలు లోకో పైలట్ కు సరైన సిగ్నల్ ఇవ్వలేదని, సిగ్నల్ వద్ద ఎంత వేగంతో వెళ్లాలనేది కూడా సూచించలేదంటూ సీఆర్ఎస్ తన నివేదికలో తెలిపింది.
ప్రమాదం జరిగిన సమయానికి ముందు కాంచన్జంగా ఎక్స్ప్రెస్ గరిష్టంగా 15 కిలోమీటర్ల వేగంతో వెళ్లిందని, ప్రతి సిగ్నల్ వద్ద ఒక నిమిషం పాటు ఆగిందని.. అయితే, గూడ్స్ రైలుతో సహా అదే మార్గంలో వెళ్లిన మిగితా ఆరు రైళ్లు మాత్రం నిబంధనలు పాటించలేదని సీఆర్ఎస్ పేర్కొన్నది.
Also Read: కారులో వెళ్తుండగా మీదపడ్డ కొండ.. ఏడుగురు మృతి
సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయని సమయంలో ఏం చేయాలనేదానిపై ఈ సందర్భంగా సీఆర్ఎస్ పలు సూచనలు చేసింది. సాధారణంగా సిగ్నల్ సరిగా పనిచేయని చోట రైలును ఒక నిమిషంపాటు ఆపి, ఆ తరువాత స్టాప్ సిగ్నల్ వరకు జాగ్రత్తగా నడపాలంటూ లోకో పైలట్లకు సూచించింది.
‘అయితే, రైల్వే బోర్డు నిబంధనలను పేర్కొంటూ.. డివిజనల్ స్థాయిలోని కంట్రోల్ ఆఫీసులో ప్రతి 8 గంటల షిఫ్ట్ లో ఒక సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఉంటాడు. అతనితోపాటు జూనియర్ ఇంజినీర్, ఒక హెల్పర్ విధుల్లో ఉంటారు. కానీ, జూన్ 16, 17న రాత్రి కంట్రోలింగ్ ఆఫీసులో ఒక టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే విధుల్లో ఉన్నాడు. ఆ ఒక్క టెక్నీషియన్ కు ఇంత పెద్ద సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహించడం సాధ్యం కాదు. కతిహార డివిజన్ సిగ్నలింగ్ డిపార్టుమెంట్ అధికారులకు ఈ తరహా వైఫల్యాలపై సమాచారం ఉంది. అయినా కూడా వారు సిగ్నలింగ్ కంట్రోలింగ్ ఆఫీసులకు ఇతర శాఖల వారితో సమాచారాన్ని అందజేయలేదు. అంతేకాదు.. ప్రమాదం జరిగిన ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే జోన్ లో వాకీ టాకీల కొరత కూడా ఉన్నట్లు మేం గుర్తించాం’ అని సీఆర్ఎస్ తన నివేదికలో తెలిపింది.