Ration Card for Rythu Runamafi : రాష్ట్రంలో ఒక్కోరైతు కుటుంబానికి రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్.. నిన్న మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. రుణమాఫికి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రైతు రుణమాఫీపై మాట్లాడుతూ.. భూమి పాస్ బుక్ ఆధారంగానే రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు నిబంధన వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
ఈ నెల 18వ తేదీ సాయంత్రం లోగా రైతుల ఖాతాల్లో లక్షరూపాయల వరకూ రుణమాఫీ నగదును జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు బ్యాంకుల అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతుల ఖాతాల్లో కాకుండా ఇతరుల ఖాతాల్లో నగదు జమ అయితే.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 18న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ అయ్యాక.. రైతు వేదికలలో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు చేయాలని మంత్రులు, అధికారులకు సూచించారు.
Also Read : రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల
తెలంగాణలో భూమి ఉన్న ప్రతిరైతు కుటుంబానికి రూ.2 లక్షల మేర రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో రేషన్ కార్డుల ఆధారంగా డేటా బేస్ ను రెడీ చేసినట్లు తెలిపింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకూ పంట రుణాలు తీసుకున్నవారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. రుణమాఫీపై రైతులకు ఉన్న అనుమానాలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. మరిన్ని వివరాలకు పోర్టల్ ను చూడాలని లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది.