Seven People killed in landslide in Karnataka: కర్ణాటకలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. అదేవిధంగా మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ఉత్తర కన్నడ జిల్లాలోని శిరూర్ పట్టణ శివారులో రహదారిపై వెళ్తున్న కారుపై మంగళవారం భారీగా కొండచరియలు విరిగి మీద పడ్డాయి. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విషయ తెలుసుకున్న అగ్నిమాపక శాఖ, ఎమర్జెన్సీ సర్వీసెస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్నారు. మరికొన్ని వాహనాలు, టీ షాప్ పై కూడా కొండచరియలు పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో పలువురు టీ తాగుతున్నారని తెలిపారు. వారిలో చాలామంది ఆచూకీ కనిపించడంలేదని సమాచారం.
Also Read: నితీష్ కుమార్ డిమాండ్స్లో న్యాయం ఉందా? ఎన్నికల స్టంటా?
స్థానిక ఎంపీ విశ్వేశ్వర హెగ్డే మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడినట్లు కమిషనర్ చెప్పారని, వారి మృతిపట్ల ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.