CM Nitish Kumar Demands Special Status for Bihar State: బీజేపీకి ప్రధాన మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ రోజుకో డిమాండ్తో కేంద్రం ముందుకు వస్తున్నారు. ఆ మధ్య బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని లేదంటే 30 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్లో న్యాయం ఎంత ఉందనేది చూడాలి. నిజానికి బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే.. ఏపీకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ డిమాండ్ కూడా కేంద్రానికి వెళ్తుంది. కేంద్రం కూడా తప్పించుకునే అవకాశం ఉండదు.
ఓ రకంగా చెప్పాలంటే ఏపీ ప్రత్యేకహోదాకు బీహార్ ఓ అడ్డుపుల్లగా ఉంది. అందుకే ఆ రాష్ట్రానికి హోదా లేదా ప్యాకేజీ వస్తే ఏపీకి లాభమే తప్పా.. నష్టం లేదు. కానీ, నితీష్ కుమార్ డిమాండ్ లో ఎంత వరకు న్యాయం ఉంది? హోదా ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలకు ఇస్తారు. లేదంటే ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాలకు ఇస్తారు. బీహార్ దేశం నడిబొడ్డున ఉంది. పైగా అభివృద్ధి వెనకబడటానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. కేవలం ఆ రాష్ట్రంలోని అవినీతే దానికి కారణం. పరిపాలనలో లోపాలే బీహార్ రాష్ట్ర వెనుకబాటుకు ప్రధాన కారణం.
ఢిల్లీ, కోల్కతా లాంటి సిటీలకు 2 వందల చరిత్ర ఉండొచ్చు. కానీ, బీహార్ రాజధాని పాట్నాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మౌర్యలు, గుప్తులు పాట్నాను రాజధానిగా చేసుకొని దేశాన్ని పాలించారు. గొప్ప విద్యా సంస్థలు, గొప్ప సంస్కృతి ఉన్న రాష్ట్రం వెనకబాటుకు గురవడానికి కారణం అక్కడి రాజకీయ పరిస్థితితులు, పరిపాలన లోపాలే. ఇటీవల బీహార్లో 10 బ్రిడ్జిలు కూలిపోయాయి. అవి వందల ఏళ్ల క్రితం కట్టిన బ్రిడ్జిలు కాదు.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు. అంటే.. బీహార్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Karnataka Job Reservation: కన్నడిగులకే 70 శాతం ఉద్యోగాలు.. సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం
ఇవన్నీ పక్కన పెట్టి నితీష్ కుమార్ 30 వేల కోట్ల నిధులు కేంద్రాన్ని అడుగుతున్నారు. నిజంగాకే కేంద్రం ఆ స్థాయిలో నిధులు ఇస్తే ఏం చేయాలో కూడా నితీష్ కుమార్ కు తెలియదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ప్రతీ ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయలేదని దౌర్భాగ్యమైన స్థితిలో బీహార్ ఉంది. గత ఆర్ధిక సంవత్సరం రాష్ట్రప్రభుత్వం పలు శాఖలకు కేటాయించిన రెవెన్యూ బడ్జెట్లో 51 వేల కోట్లు ఖర్చు చేయలేకపోయాయి. మరోవైపు మూలధన వ్యయంలో15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేకపోయారు.
మౌలిక సదుపాయాల కల్పన కోసమో, స్కూల్లు, కాలేజీల నిర్మాణం కోసం కేటాయిస్తే ఆయా శాఖల అభివృద్ధికి దోహదం జరుగుతుంది. లేదంటే.. రోడ్లు నిర్మాణం జరిగితే పెట్టుబడులను ఆకర్షించవచ్చు. కానీ.. బడ్జెట్ కేటాయింపులనే సరిగా వాడుకోలేకపోయారు. అలా అని మేధాశక్తి, మానవ వనరులు లేవా అంటే అదీ కాదు. దేశంలో ఎక్కువ మంది సివిల్ సర్వీసుల్లో ఉన్నవారు బీహార్ కు చెందిన వారే. దేశంలో ఏ మూలకు వెళ్లినా రోజువారీ కూలీలుగా కనిపించేది బీహార్ కు చెందిన వారే. అంటే మేథాశక్తి, మానవవనరులు అద్భుతంగా ఉన్నాయి. కానీ.. పరిపాలనలో లోపాలు, అవినీతి రాజ్యమేలినపుడు సంపాదనపైనే దృష్టి ఉంటుంది తప్పా.. ఉన్న వనరులను ఎలా వినియోగించుకోవాలో తెలియదు.
Also Read: Protestors: పారిశ్రామికవేత్త కోసం నిరసనకారులపై పోలీసుల కాల్పులు: మద్రాస్ హైకోర్టు
ఇప్పుడు నితీష్ కుమార్ అడిగినట్టు కేంద్రం 30 వేల కోట్లు ఇస్తే దానికి సక్రమంగా ఖర్చు చేస్తారనే నమ్మకం లేదు. నితీష్ కుమార్ డిమాండ్ పై మరి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో విపక్షాలకు అస్త్రాలు ఇవ్వకుండా ఉండటానికే ఆయన డిమాండ్ చేస్తున్నారు తప్పా.. బీహార్ ప్రత్యేక హోదా విషయంలో ఆయనకు చిత్తశుద్ది లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.