BJP : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి ఎదురైనా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఫలితాలు వేరుగా ఉంటాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీ నేతలకు కాషాయ కండువాలు కప్పే కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళుతున్నారు. తాజాగా మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారు. మరి కొందరు నేతలకు బీజేపీ తీర్థం ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి కారుకు షాక్ ఇవ్వాలన్నదే కాషాయ నేతల ఆలోచన. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
మరోవైపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ముందుకుసాగుతున్నారు. డిసెంబర్ 16న బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. తెలంగాణపై ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర నేతలకు జేపీ నడ్డా దిశానిర్ధేశం చేస్తారని తెలుస్తోంది. నడ్డా షెడ్యూల్ దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉండాలని రాష్ట్ర నేతలకు సూచించారని సమాచారం.
బండి సంజయ్ ఆరోవిడత పాదయాత్రకు రూట్ మ్యాప్ రెడీ అవుతోందని తెలుస్తోంది. ఐదో విడత పాదయాత్ర ముగిసిన నాలుగు రోజులకే ఆరో విడత పాదయాత్ర చేయాలని బండి సంజయ్ యోచిస్తున్నారు. మొత్తానికి ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ ను గట్టి దెబ్బ కొట్టాలని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.
బండి సంజయ్ ఓ పక్క పాదయాత్ర చేస్తూనే మరోపక్క జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కాషాయ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఐదో విడత పాదయాత్ర ముగిసేసరికి ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు పూర్తిచేసి ఎన్నికలకు సమాయత్తం చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేశారు.
ఇంకోవైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ సీఎం కేసీఆర్ సడన్ గా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే దానికి తగ్గట్టుగా బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు నగారా మోగితే బండి సంజయ్ పాదయాత్రను ముగిస్తారు. అప్పుడు బీజేపీ బస్సు యాత్ర చేపడుతుందని తెలుస్తోంది. ఇలా ద్విముఖ వ్యూహంతో కాషాయ నేతలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.