Telangana Engineering Colleges Seats Increasing: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ఇంజినీరింగ్ సీట్లను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఎన్ని సీట్లు పెంచుతున్నరనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా పెరగనున్న సీట్ల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 10వేల వరకు సీట్లు పెరగొచ్చని సమాచారం.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం 99వేల ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 70,500 వరకు సీట్లు ఉండగా.. వీటికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఏడాది 98,296 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పలు కళాశాలలు డిమాండ్ లేని బ్రాంచీలను తొలగించి..ఆయా సీట్లను డిమాండ్ ఉన్న సీఎస్ఈకి మార్చుకుంటామని దరఖాస్తు చేసుకున్నాయి. ఇవే దాదాపు 6,500 సీట్ల వరకు ఉండొచ్చని అంచనా.
ఇంజినీరింగ్ సీట్లను పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ఈ సీట్లను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో వెబ్ ఆప్షన్ల నమోదుకు ఇచ్చిన గడువును సైతం ఈనెల 17 వరకు పొడిగించారు. వాస్తవానికి వెబ్ ఆప్షన్లకు తుది గడువు సోమవారంతో ముగియాల్సి ఉంది. కానీ అదనపు సీట్లను కౌన్సెలింగ్ కు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున ఈ గడువును రేపటి వరకు పెంచినట్లు ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సోమవారం నాటికి 93,167 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు.
Also Read: ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే.. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఏడాది అదనపు సీట్లకు అనుమతి ఇవ్వాలని కాలేజీల యజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. మొదట 20 వేల సీట్ల వరకు పెంచాలని కాలేజీలు ప్రతిపాదించగా.. పరిశీలించిన ప్రభుత్వం 10వేల సీట్ల వరకు పెంచడానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. పెరగనున్న సీట్లలో ఎక్కువ శాతం సీఎస్ఈకి సంబంధించిన కోర్సులే ఉండనున్నట్లు తెలుస్తోంది.