KTR Helps Rs 50,000 to Poor Family in Palakurti: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో చురుకుగా ఉంటారు. అప్పట్లో అధికారంలో తమ పార్టీ ఉన్పప్పుడుకూడా ట్విట్టర్ లో పబ్లిక్ సమస్యలకు తక్షణమే స్పందించేవారు. వెంటనే వారికి ఆర్థిక సాయం అందించడంలో ముందుండేవారు. అయితే ప్రస్తుతం అధికారంలో లేకపోయినా కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూనే ఉన్నారు. గతంలో ఆర్థిక పరిస్థితితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రైతుకు ఆర్థిక సాయం అందించి తన దయాగుణం చాటుకున్నారు. అందరూ పార్టీలకతీతంగా ఈ విషయంలో కేటీఆర్ ను అభినందిస్తుంటారు. కార్యకర్తలు ఆరాధిస్తుంటారు.
ఇప్పుడు మరోసారి ఓ పేద కూలీ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించి మరోసారి వార్తలలోకి ఎక్కారు. పాలకుర్తి మండలానికి చెందిన శ్రీను అనే వ్యక్తి ఇటీవల మరణించాడు. నిత్యం కూలి పనులు చేసుకుని బతుకేవాడు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారతనికి. కటిక నిరుపేద కావడంతో చనిపోయినప్పుడు కనీసం దహనసంస్కారాలకు సైతం డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి అప్పటికప్పుడు డబ్బులు పోగుచేసి దహనసంస్కారాలను జరిపించారు.
సోషల్ మీడియా పోస్టుకు స్పందన..
భర్త శ్రీనుతో కలిసి భార్య కూడా కూలి పనులకు వెళ్లేది. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లల పోషణ తలకు మించిన భారంగా తయారయింది. కనిపించిన ప్రతి ఒక్కరినీ సాయం చేయాలని వేడుకుంటోంది. ఎవరో అజ్ణాత వ్యక్తి ఈ తల్లీకూతుళ్ల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అది చూసి ఓ పెద్ద మనిషి వీరికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించాడు. సోషల్ మీడియా పోస్టు చూసి స్పందించిన కేటీఆర్ కూడా ఇప్పుడు ఆ కుటుంబానికి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కెపాసిటీ మేరకు ఆ కుటుంబానికి అండగా నిలబడతానన్నారు.
Also Read: HarishRao wearing TRS scarf: బీఆర్ఎస్లో మార్పులు, టీఆర్ఎస్ కండువాతో హరీష్రావు
పిల్లల చదువులు, పోషణ నిమిత్తం తాను ఎంతైనా సాయం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా వారిని అధైర్య పడొద్దని అన్నారు. వారి వివరాలు పంపితే తాను చేయగలిగినంత సాయం చేస్తానని కేటీఆర్ ప్రకటించడంతో అందరూ ట్విట్టర్ వేదికా కేటీఆర్ స్పందించిన తీరుకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేటీఆర్ ఇచ్చిన భరోసాతో ఇప్పుడు మరికొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ కుటుంబానికి సాయం అందించేందుకు ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. తమ పార్టీ నేత కేటీఆర్ గతంలో చాలా సందర్భాలలో అనేక మందికి అప్పటికప్పుడే సాయం అందించారని.ఆయన కూమారుడు కూడా ఇలాంటి సాయం చేయడంలో ముందుంటాడని ఈ సందర్భంగా కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు.