Couple Suicide in Nizamabad: భార్య చేసిన ఒక తప్పుని భర్త క్షమించినా.. బంధువులే రాబందులై దుష్ర్పచారం చేయడాన్ని తట్టుకోలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ – మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్ (28), పొతంగల్ కు చెందిన శైలజ (24)కు ఏడాది క్రితమే పెళ్లైంది. అన్యోన్యంగా ఉండే వారి దాంపత్యంలో భార్య చేసిన ఒక తప్పు మనస్పర్థలకు కారణమైంది. దానిని భర్త క్షమించినా బంధువులు మాత్రం మనకెందుకులే అని వదిలిపెట్టలేదు. రాబందుల్లా వారిపై దుష్ర్పచారం చేశారు.
సోమవారం ఒక ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి.. బయటకు వచ్చారు. ఆ తర్వాత తానొక తప్పు చేశానని, భర్త క్షమించినా బంధువులు పీక్కుతింటున్నారని వాపోతూ ఒక వీడియో రికార్డు చేసి పోలీసులకు పంపారు. అందులో తామిద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. వీడియో ఎస్సై సందీప్ కు చేరగా.. వెంటనే నవీపేట ఎస్సై యాదగిరి గౌడ్ కు ఆ వీడియో, వారి ఫోన్ నంబర్ ను పంపారు.
Also Read: HarishRao wearing TRS scarf: బీఆర్ఎస్లో మార్పులు, టీఆర్ఎస్ కండువాతో హరీష్రావు
అప్రమత్తమైన పోలీసులు.. బాసర వంతెన వద్దకు చేరుకుని గాలించారు. ఆ చుట్టుపక్కల గానీ, నదిలో గానీ దంపతులు కనిపించలేదు. బాధితుల ఫోన్ నంబర్ ను ట్రాక్ చేయగా.. ఫకీరాబాద్ – మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లి చూసిన నవీపేట ఎస్సైకు.. రైల్వే పట్టాలపై మృతదేహాలు కనిపించాయి. ఘటనపై రైల్వే పోలీసులకు సమాచారం అందించి.. కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి బంధువులకు సమాచారమిచ్చారు.