Subramanian Swamy comments on BJP Party: బీజేపీ ప్రతిష్ట మసకబారుతోందా? దశాబ్దం తర్వాత ఆ పార్టీ క్రమం గా డౌన్ ఫాల్ అవుతుందా? పదేళ్ల తర్వాత సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ఎందుకు నోరు విప్పారు? ఆయన అన్నట్లుగా టైటినిక్ షిప్ మాదిరిగా బీజేపీ మునిగిపోతుందా? స్వామి వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశమేంటి? ఇలా రకరకాల ప్రశ్నలు సీనియర్ నేతలను వెంటాడుతున్నాయి.
ప్రతీ రాజకీయ పార్టీకి స్వర్ణయుగం ఉంటుంది. అలాగే గడిచిన పదేళ్లు బీజేపీకి స్వర్ణయుగం. రెండుసార్లు సొంత మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మూడోసారి మాత్రం మిత్రులపై ఆధారపడాల్సి వచ్చింది. ఇందుకు కారణాలు అనేకం. కేడర్ను నిర్లక్ష్యం చేశారని కొందరంటే, వలస నేతలకు ప్రయార్టీ ఇచ్చారని మరికొందరు.
ఇలా ఎవరి విశ్లేషణలు వాళ్లు బయటపెట్టారు. పార్టీలో అంతర్గత కలహాలా? నేతల లోపమా? అనేది పక్కనపెడితే.. సీనియర్లు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. ఈ జాబితాలో సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ముందు ఉన్నారనే చెప్పవచ్చు. ఇటీవల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని పరాభవం ఎదురైంది. ఇండియా కూటమి భారీగా సీట్లు సాధించింది.
Also Read: భారత ఆర్మీపై ఉగ్రవాదుల పంజా.. నలుగురు సైనికులు మృతి
ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ విజయం సాధిస్తుందని అంటున్నారు నేతలు. ఉత్తరా ఖండ్లో బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఓటర్లు కమలనాధులకు ఊహించని ఝలక్ ఇచ్చారు. ఎందుకిలా జరిగిందనే దానిపై లోలోపల కమలనాథులు మథనపడుతున్నారు. ఈ క్రమంలో నోరు విప్పారు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి.
సుత్తు లేకుండా చెప్పాల్సిన రెండుమాటలు సోషల్మీడియా వేదికగా పెద్దాయన చెప్పేశారు. బీజేపీ పార్టీ టైటానిక్ షిప్ మాదిరిగా మునిగిపోవాలని కోరుకుంటే అందుకు సారథ్యం వహించడానికి నరేంద్రమోదీ సరైన వ్యక్తి అని అన్నారు. పార్టీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతోందన్నారు. దీనికి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శమని మనసులోని మాటను అక్షరాల రూపంలో బయటపెట్టారు స్వామి.
Also Read: Karnataka Job Reservation: కన్నడిగులకే 70 శాతం ఉద్యోగాలు.. సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం
ఇంతకీ స్వామి ఎవర్ని హెచ్చరించారంటూ చర్చించుకోవడం కమలనాధుల వంతైంది. స్వామి మాటల వెనుక లోగుట్టు ఏంటంటూ మాట్లాడుకుంటున్నారు. మోదీ పాలనను చూసి ప్రజలు విసుగుచెందారా? లేక పార్టీలో అంతర్గత వ్యవహారాలపై బయటపెట్టలేక స్వామి ఈ విధంగా మాట్లాడారా? మరి స్వామి మాటల వెనుక అర్థమేంటి? తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.