Modi Government follows Farmers against progremmes no subsidies
అధికారం చేపట్టేందుకు వచ్చే ప్రతి ప్రభుత్వం రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని..రైతే రాజు అంటూ ఊదరగొట్టడమే తప్ప రైతుల బతుకుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. రానురానూ వ్యవసాయం దండగ..ఉద్యోగమే పండుగ అనుకునే పరిస్థితికి తెస్లున్నారు పాలకులు. అప్పోసొప్పో చేసి, ఇబ్బందులెన్ని వచ్చిన పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తులు..మరో పక్క రైతుకు గిట్టుబాటు ధర దక్కనీయక ధళారుల దోపిడీ..చేసిన పంట రుణాలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎవరిని నిందించాలో..తమ బతుకులు ఎలా బాగుపడతాయో అర్థం కాని పరిస్థితిలోకొట్టుమిట్టాడుతున్నారు. గత పదేళ్లుగా మోదీ సర్కార్ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ బాహాటంగా ప్రచారం చేస్తూ వస్తోంది. మోదీ తన ప్రసంగాలలో రైతు ల ఆదాయం పెంచుతాం అని చెబుతూనే వాళ్లకు అందించే సబ్సిడీలపై చిన్నచూపు చూస్తున్నారని ..అసలు కేంద్ర సబ్సిడీలే లేకుండా చేస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారంగా మారిన ఎరువుల ధరలు
దేశవ్యాప్తంగా 2022 నుంచి ఎరువుల ధరలను 50 శాతం మేరకు పెంచుకుంటూ వస్తోంది కేంద్రం. అదేమంటే అంతర్జాతీయ ధరలు రెట్టింపు కావడంతో ఆ భారం రైతులే తీర్చుకోవాలన్నట్లుగా అంతకంతకూ పెంచేసుకుంటూ పోతోంది. ఎరువులు వేయకపోతే పంటకు చీడపట్టి నాశనమవుతున్నాయి. అసలు రైతుకు సబ్సిడీ కింద తక్కువ ధరలకు ఎరువులను అందించాల్సిన కేంద్ర ప్రభుత్వమే కమర్షియల్ వ్యాపారస్తుల మాదిరిగా రైతులతో వ్యవహరిస్తోంది. రైతులు పండించిన పంటలకు మద్ధతు ధర కూడా బాగా తగ్గించేసింది. దీనితో ధాన్యం నిల్వలు బాగా పెరిగిపోతున్నాయి. అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్నచందంగా తయారవుతోంది రైతుల పరిస్థితి.
సబ్సిడీలు తగ్గించేశారు
మొన్నటి ఆర్థిక బడ్జెట్ లోనూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎరువుల సబ్సిడీ గణనీయంగా తగ్గించేశారు. దీనితో రైతుల నెత్తిన పిడుగు పడినట్లయింది. అదే సమయంలో పెరిగిన ఎరువుల ధర రైతును మరింతగా కుంగదీస్తోంది.
దీనికి తోడు రైతన్నలు కొనుగోలు చేసే ఎరువులు, రసాయనాలపై కేంద్రం విధించిన జీఎస్టీ రేటు కలిపి వ్యాపారస్తులు రైతన్న మీదే భారం మోపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు పెరిగితే ఆ భారాన్ని కేంద్రమే భరించాలి. ఇప్పటికే అతివృష్టి..అనావృష్టితో పంటలు దెబ్బతిని, పంటల కోసం చేసిన రుణాలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు కేంద్రం అండగా నిలబడాలి. పెంచిన ఎరువుల ధరలను తగ్గించి..రైతులకు సబ్సిడీ ధరకు అందించే యంత్ర పరికరాలు, విత్తనాలు, ట్రాక్టర్లు వంటి వాటిని రైతులకు అందుబాటులో ఉంచాలని రైతులు కేంద్రాన్ని కోరుతున్నారు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఇకనైనా తన మాట నిలబెట్టుకోవాలని దేశవ్యాప్తంగా రైతులు కోరుతున్నారు. రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందంటున్నారు.