Modi : గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ రాణిప్లోని పోలింగ్ బూత్ కు క్యూలైన్లో వెళ్లి మోదీ ఓటేశారు. ప్రధాని ఈ ఉదయం గాంధీనగర్ రాజ్భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. రాణిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్కు వచ్చిన మోదీ.. కాన్వాయ్ను కొంతదూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోదీ ట్విటర్ ద్వారా పిలుపునిచ్చారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శైలజ్ అనుపమ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సీఎం పటేల్ కూడా క్యూలైన్లోనే వెళ్లి ఓటు వేశారు. గుజరాత్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దంపతులు అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్ లోనే ఓటేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం, 11 గంటలకు 19.17 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రెండో విడతలో 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.51 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడికానున్నాయి. డిసెంబర్ 8న గుజరాత్తోపాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.