Cabinet sub Committee visits Warangal: త్వరలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం వరంగల్ లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘వరంగల్ నుంచే రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్ లాంటి పథకాలు అమలు చేశాం.
రైతు బంధు ఇచ్చాం.. ఇప్పుడు రైతు భరోసాపై అమలుకు విధివిధానాల రూప కల్పన కోసం విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. అసెంబ్లీలో ఒక్క రోజంతా చర్చ పెడతాం. రైతులకు అందించే భరోసా సొమ్ము ప్రజలు టాక్స్ రూపంలో చెల్లించినవే. అందుకే ప్రతి పైసా సక్రమంగా వినియోగం కోసం అన్ని వర్గాల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటున్నాం. రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇన్స్యూరెన్స్ కంపెనీలతోనూ చర్చలు జరుపుతున్నాం. విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చేశాం. రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవాలి. ఆగస్టు నాటికి రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తాం’ అంటూ హామీ ఇచ్చారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘రైతులకు రుణమాఫీ సీఎం భీష్మ ప్రతిజ్ఞ. నిధులు సమకూరుస్తున్నాం.. ఖచ్చితంగా అమలు చేస్తాం. గత ప్రభుత్వం రైతు బంధులో బకాయి పెట్టిన రూ. 7562 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. అర్హులైన ఏ రైతుకు నష్టం జరగదు. రైతులందరికీ న్యాయం చేయడానికి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. విత్తనాలు , ఎరువులు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంచాం’ అని అన్నారు.
Also Read: రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ‘గతంలో కొండలు కొండలు ఫాం హౌస్లు ఉన్నవారికి రైతుబంధు పేరుతో కోట్ల రూపాయలు ఇచ్చారు. రైతు భరోసాపై ఇప్పటికే నాలుగుసార్లు సబ్ కమిటీ మీటింగ్ నిర్వహించింది. రైతులకు తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఐటీ చెల్లించేవారికి రైతు భరోసా ఇవ్వమని ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారంలో నిజం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉంది’ అంటూ పొంగులేటి పేర్కొన్నారు.
‘గత ప్రభుత్వం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఓపెన్ మైండ్ తో మా ప్రభుత్వం వెళుతోంది. ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటాం. వైఎస్ హయాంలో రైతులకు మేలు జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో భూములు దోచుకుంది. ఇందిరమ్మ ఇచ్చిన భూములు గత సర్కారు లాక్కుంది. కేసీఆర్ సర్కార్ అఖిల పక్షం అని చెప్పి నాలుగు గోడల మధ్య నలుగురు మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. ప్రజల మధ్యనే చర్చను పెడతాం. మా ప్రభుత్వం మాత్రం అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటుంది. పంటల బీమాతోపాటు పశువులకు ఇన్స్యూరెన్స్ ఇవ్వాలి’ మంత్రి కొండా సురేఖ్ అన్నారు. గతంలో రైతు బంధులో అక్రమాలు జరిగాయని, రైతు భరోసాను అర్హులకు అందించి న్యాయం చేయాలనే ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేస్తుందంటూ మంత్రి సీతక్క తెలిపారు.