No Fine for Motorists in Bengaluru : బెంగళూరులో కొత్తగా ఒక ట్రాఫిక్ రూల్ అమల్లోకి వచ్చింది. ఈ రూల్ తో అక్కడి అంబులెన్సుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అంతేకాదు వాహనదారులకు కూడా సిగ్నల్ జంప్ ఫైన్ల నుంచి ఊరట లభించనుంది. ఇకపై బెంగళూరులో అంబులెన్సులకు దారి ఇచ్చేందుకు సిగ్నల్ జంప్ చేసే వాహనదారులకు ఫైన్ విధించబోమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నిబంధనపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్సుల్లో పేషంట్ ఉన్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుంటే.. వారికి వైద్యం ఆలస్యమవుతుందన్న ఆలోచనతో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంబులెన్సులకు దారిచ్చేందుకు సిగ్నల్ జంప్ చేసినపుడు ఫైన్ పడితే.. వాహనదారులు ఇన్ ఫాంట్రీ రోడ్ లో ఉన్న ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సెంటర్ ను సంప్రదిస్తే జరిమానా తొలగిస్తారని తెలిపారు. అలాగే కర్ణాటక స్టేట్ పోలీస్ యాప్ ను కూడా ఈ విషయమై సంప్రదించవచ్చన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంతో పాటు.. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకై ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుచేత్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్ కు దారిచ్చేందుకు వాహనదారుడు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే జరిమానా రద్దవుతుందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అంబులెన్సుల్ని గుర్తించిన వెంటనే గ్రీన్ కలర్ సిగ్నల్ ఇచ్చేలా జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 80 అంబులెన్సులకు జీపీఎస్ ను అమర్చినట్లు కర్ణాటక ఆరోగ్య సంక్షేమ శాఖ పేర్కొంది.