Home Minister Anitha Press Meet in Amaravati : రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షిస్తామని హోమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల, విజయనగరం, జిల్లాల్లో జరిగిన అత్యాచార ఘటనలపై ఆమె ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ రెండు ఘటనల్లోని నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. తప్పు చేసిందెవరైనా సరే.. చట్టం నుంచి తప్పించుకోలేరని హితవు పలికారు.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ముగ్గురు మైనర్ల చేతిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారాన్ని ప్రకటించారు. అలాగే విజయనగరం జిల్లాలో అత్యాచారానికి గురైన 6 నెలల చిన్నారి పేరుపై రూ.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు హోంమంత్రి అనిత. ఇకపై ఎవరైనా ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తే అదే వారికి చివరి రోజవుతుందని హెచ్చరించారామె.
Also Read : దారుణం.. ఊయలలో ఉన్న 6 నెలల చిన్నారిపై తాత అత్యాచారం
నంద్యాలజిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పీఎస్ పరిధిలోగల ఎల్లాల గ్రామానికి చెందిన 8 సంవత్సరాల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి, హత్య చేశారు. జరిగిన ఘటన గురించి బాలిక ఇంట్లో చెబుతుందన్న భయంతో హత్యచేసి, మృతదేహాన్ని సమీపంలోని చెరువులో పడేశారు. ఐదురోజులైనా ఇంతవరకూ బాలిక మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు బాలిక మృతదేహం కోసం క్షుణ్ణంగా గాలిస్తున్నారు. అడుగడుగునా వెతికించినా మృతదేహం లభ్యం కాకపోవడంతో.. అసలు బాలిక మృతదేహాన్ని అక్కడే పడేశారా లేక మరేదైనా చేసి ఉంటారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
ముచ్చుమర్రి ఘటన మరువకముందే.. విజయనగరం జిల్లాలో ఊయలలో ఉన్న ఆరునెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. వరుసకు తాత అయిన వ్యక్తి చిన్నారిపై అఘాయిత్యం చేసి పరారవ్వగా.. తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.