BRS MLA Gudem Mahipal Reddy to joins congress: బీఆర్ఎస్ పార్టీకి, మాజీ సీఎం కేసీఆర్కు వరుసగా షాక్ ల మీద షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న కేసీఆర్కు కోలుకోని విధంగా వ్యతిరేక గాలి వీస్తోంది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ.. ఒక్కసారిగా ఊహించని విధంగా గ్రాఫ్ పడిపోయింది. చివరకు 49 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుగులేని విజయం సాధిస్తామనుకున్నారు. అది కూడా వంద సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలవబోతుందంటూ షరతులు కూడా విధించారు. రిజల్ట్స్తో వాటీజ్ వాట్ అనేది స్పష్టమైపోయింది. ఇగ అప్పటి నుంచి కేసీఆర్ తీవ్ర నిరాశలోనే ఉన్నారు. ఆ తరువాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మరో షాక్ తగిలింది. ఊహించని నేతలు పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీ కుండువా కప్పుకున్నారు.
మరో భారీ షాక్ ఏమిటంటే.. తమ పార్టీకి చెందిన పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినవారు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేసీఆర్కు, బీఆర్ఎస్కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా పార్లమెంటు ఎన్నికల్లో అయినా ఎక్కువ సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలి అనుకున్నారు. అది కూడా 16 సీట్లు గెలుస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, చివరకు ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. తాను అనుకున్న 16 సీట్లు కాదు కదా.. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో పుండు మీద కారం చల్లినట్లయ్యింది కేసీఆర్కు.
ఇదిలా ఉంటే.. ఉన్న ఎమ్మెల్యేలతోనై అధికార పార్టీపైనా యుద్ధం చేద్దామనుకుంటే వాళ్లు కూడా కారు దిగుతున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటివరకు 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. అది కూడా తాను ఊహించని వ్యక్తులు.. ఎప్పుడూ తన వెంటే ఉండి తనకు ధైర్యం ఇచ్చే వ్యక్తులు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత పదవుల్లో పనిచేసిన నేతలు పార్టీని వీడిపోతున్నారు. వారు పోతుపోతూ.. పార్టీని నడిపిస్తున్న నేతల తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఏకపక్ష ధోరణిని కేసీఆర్.. ఆయన కొడుకు కేటీఆర్ వీడనాడాలంటూ సలహాలు ఇస్తున్నారు. అప్పుడు మాత్రమే పార్టీ ఇకమీదట బ్రతికి బట్టకడుతుందంటూ సూచనలు చేస్తున్నారు.
Also Read: కేసీఆర్ కు కోలుకోని దెబ్బ.. మరో 10 మంది ఎమ్మెల్యేలు జంప్?
ఇక తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. పటాన్ చెరుకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అందుకే ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఆయనకే టికెట్ ఇచ్చారు కేసీఆర్. పటాన్ చెరు బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు గురించి ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎవరికి టికెట్ దక్కనున్నదో అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. చివరకు మహిపాల్ రెడ్డికే టికెట్ వరించింది. ఎన్నికల్లో విజయం సాధించారు. తాను టికెట్ ఇచ్చిన మహిపాల్ రెడ్డి తన వెంటే ఉంటాడనుకుంటే బీఆర్ఎస్ వీడుతున్నారు. ఇది కేసీఆర్ కు కోలుకోలేని మరో షాక్ అని అంటున్నారు జనాలు.
అయితే, మహిపాల్ రెడ్డి ఎందుకు పార్టీ మారుతున్నారు..? కారణం ఏమై ఉండొచ్చంటూ భారీగా చర్చిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తో ఆయనకు అత్యంత సాన్నిహిత్యం ఉన్నందున జనాలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరువాత ఆయన ఏం చెప్పబోతున్నారో అనేది.
ఇదిలా ఉంటే.. ఈ వలసలపై కాంగ్రెస్ నేతలు మరో బాంబు పేల్చుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన నేతలే కాదు.. ఇంకా మరో పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో త్వరలోనే చేరబోతున్నారంటూ చెబుతున్నారు.