Naxals : నక్సల్స్ నుంచి అమెరికాలో తయారైన ఆయుధం పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఛత్తీస్గఢ్లో నవంబర్ 26న జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సలైట్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో అమెరికాలో తయారైన తుపాకి ఉన్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. బీజాపుర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ కడ్తి (40), మట్వారా ఎల్వోఎస్ సభ్యుడు రమేష్ (32), మహిళా మావోయిస్టు నేత సుమిత్ర (28), మరో మహిళా మవోయిస్టు మృతి చెందారు.
ఘటనాస్థలం నుంచి మావోయిస్టు మృతదేహాలతోపాటు నాలుగు ఆయుధాలు, పేలుడు సామగ్రి, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అమెరికాలో తయారైన ఎం1 కార్బైన్ తుపాకి ఉన్నట్లు గుర్తించారు. బ్యారెల్ చిన్నగా ఉండటంతో ఇతర అసాల్ట్ రైఫిళ్లతో పోలిస్తే దీని నిర్వహణ సులభమని వివరించారు. తుపాకిపై ఉన్న సీరియల్ నెంబర్ ఆధారంగా నక్సలైట్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి తుపాకులను అమెరికా సైన్యం రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం, కొరియన్ యుద్ధంలో ఉపయోగించిందని పోలీసుల తెలిపారు.
మావోయిస్టుల వద్ద విదేశీ ఆయుధాలు గతంలోనూ దొరికాయి. 2011,2014లో భానుప్రతాపూర్, రోఘట్ లో అమెరికాలో తయారైన 7.65 ఎంఎం ఆటోమేటిక్ పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లాలో 2018లో జరిగిన ఎదురుకాల్పుల సమయంలో జర్మనీలో తయారైన తుపాకీ లభించింది.