Teamindia: బంగ్లాదేశ్ టూర్ లో భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో 1 వికెట్ తేడాతో ఓడిపోయింది. టీమిండియా నిర్దేశించిన 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి చేధించింది. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై భారత్ పేసర్లు విజృంభించడంతో ఒకదశలో బంగ్లాదేశ్ 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా పేసర్లు దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అరంగేట్రం బౌలర్ కులదీప్ సేన్ ధారాళంగా పరుగులిచ్చినా కీలక సమయంలో 2 వికెట్లు నేలకూల్చాడు. సిరాజ్ మూడు వికెట్లు, సుందర్ రెండు వికెట్లు, శార్దుల్ ఠాకూర్ , చాహర్ తలో ఒక వికెట్ తీశారు.
బంగ్లా జట్టులో కెప్టెన్ లిట్టన్ దాస్ 41 పరుగులతో రాణించాడు. షకీబ్ హల్ హసన్ 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఒక దశలో బంగ్లాదేశ్ సునాయాసంగా విజయం సాధిస్తుందనేలా మ్యాచ్ సాగింది. కానీ 8 పరుగుల తేడాలో 5 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. అయితే ఆ సమయంలో మెహదీ హసన్ మిరాజ్ మెరుపులు మెరిపించాడు. మిరాజ్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులతో అజేయంగా నిలిచి బంగ్లాదేశ్ కు విజయాన్ని అందించాడు. చివరి వికెట్ కు ముస్తాఫిజుర్ రెహ్మాన్ ( 10 నాటౌట్) తో కలిసి అజేయంగా 51 పరుగులు జోడించాడు. దీంతో మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ విజయం సాధించింది. అయితే ఆ జట్టు స్కోర్ 157 పరుగుల వద్ద ఉండగా మిరాజ్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ వదిలివేయడంతో మ్యాచ్ భారత్ చేజారింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలింగ్ అనుకూలించిన ఈ పిచ్ పై బంగ్లా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 73 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 24 పరుగులు క్రీజులో నిలదొక్కుకున్న సమయంలో అవుట్ కావడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. చివరికి 41.2 ఓవర్లలోనే 186 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ హల్ హసన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఎబాదత్ హోస్సేన్ కు 4 వికెట్లు, మెహదీ హసన్ మిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.