Telangana Secretariat (Today breaking news in Telangana): తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకు, నిరుద్యోగులకు తోపులాట జరిగింది.
డీఎస్సీని వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిరుద్యోగులు పలు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
సెక్రటేరియట్ లో ఆర్థకి, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్న తరుణంలో బీసీ జనసభ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో సచివాలయానికి నిరుద్యోగులు తరలివెళ్లారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
సెక్రటేరియేట్ నాలుగు గేట్ల దగ్గర పోలీసులు నిఘా పెట్టారు. మూడు విభాగాల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ తో పటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ పరీక్షలను వాయిదా వేయాలని అశోక్ నగర్, దిల్ సుఖ్నగర్ ప్రాంతాల్లో నిరుద్యోగుల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.