YSRCP Balineni srinivasareddy: జగన్ పార్టీలో ఏం జరుగుతోంది? దాదాపు అరడజను మంది నేతలు గోడ దూకేందుకు సిద్ధమయ్యారా? ఎందుకు అధినేత సైలెంట్గా ఉన్నారు? నేతలను ఆపేందుకు కనీసం ప్రయత్నాలు చేయలేదా? కొంతమంది నేతలు పార్టీలో ఉండకుండా పొగ బెడుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికారంలో ఉన్నంతసేపు అధికార పార్టీ గురించి ఏ విషయం బయటకురాదు. ఒక్కసారి అధికారం కోల్పోయాక అనేక సమస్యలు వెంటాడుతాయి. అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఉమ్మడి ప్రకాశం జిల్లా. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన తమ పార్టీకి రాజీనామా చేయాలని భావించినా, కొంతమంది కన్వీన్స్ చేయడంతో వెనక్కితగ్గారు. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకు రాలేదాయన.
బాలినేనిని పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. పార్టీ ఓటమి తర్వాత హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వచ్చారాయన. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని తిరిగి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న జంకె వెంకటరెడ్డి పనితీరు అంతంత మాత్రమే ఉండడంతో ఆయన స్థానంలో చెవిరెడ్డిని నియమించేందుకు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన తర్వాత బాలినేని కాసింత ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ హైకమాండ్ మార్చాలనుకుంటే మిగతా జిల్లాల అధినేతలను మార్చాలని, మా జిల్లాలో కనీసం కొన్నైనా పార్టీకి సీట్లు వచ్చాయని, మిగతా జిల్లాల్లో అదీ కూడా లేదన్నారట.
ALSO READ: అధికారిణితో అక్రమ సంబంధంపై విజయసాయిరెడ్డి క్లారిటీ.. ఆ న్యూస్ ఛానల్స్ ను వదలబోం
చెవిరెడ్డి రాకను బాలినేనితోపాటు చాలామంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అదే జరిగితే తాను పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమేనని అధిష్టానానికి వర్తమానం పంపారట బాలినేని. దీంతో కీలక నేత రంగంలోకి దిగి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలినేని సోమవారం ఒంగోలుకు వచ్చారు. ఒంగోలు వ్యవహారాన్ని పరిశీలిస్తున్న ఆ పార్టీ నేతలు, ఈ లెక్కన మిగతా జిల్లాల నేతలకు పదవీ గండం తప్పదంటూ చర్చించుకుంటున్నారు.