Kcr : మహబూబ్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీపై కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసీఆర్ .. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని మోదీయే అన్నారని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా? అని ప్రశ్నించారు. బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని మోదీ చెప్పారని… ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే ప్రజాస్వామ్య విధానమా? అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నలుగురు దొంగలు వస్తే.. వారిని పట్టుకుని జైల్లో పెట్టామని కేసీఆర్ అన్నారు.
కేంద్ర విధానాలతో నష్టం
మోదీ సర్కారు వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ ఇంకా పెరిగి ఉండేదన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చేందుకు మోదీకి ఎనిమిదేళ్లు సరిపోలేదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో గ్రామాల్లో చర్చ జరగాలన్నారు. ప్రజలు, మేధావులు, యువత ఆలోచించాలని సూచించారు. ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పామని… ఆ విధంగానే చేసి చూపించామన్నారు. రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏమీ చేయరు, చేసే వారి కాళ్లలో కట్టెలు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ రాజకీయాల కోసం కాదన్నారు. తెలంగాణ రైతు దేశంలోనే గర్వంగా తలెత్తుకుని నిలబడాలని భావించామన్నారు.
కష్టాలను గుర్తు చేస్తూ
సమైక్య పాలకులు తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని కేసీఆర్ అన్నారు. వలసలతో వలవలపించేను పాలమూరు అనే పాట ఉండేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడ్డ జిల్లా అంటున్నారని చెప్పారు. పోరాటాలు చేసిన సాధించుకున్న తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక హబ్గా మారుతోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించటం లేదని మండిపడ్డారు.
హామీలివే..!
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణకు ఎవరూ సాటి లేరు.. పోటీ లేరు అని కేసీఆర్ అన్నారు. ప్రతి వర్గానికి ఒక కార్యక్రమం చేపట్టి ఆదుకుంటున్నామని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారని అన్నారు. గతంలో రూ. 50 వేలు ఇచ్చే ఆపద్బంధు కోసం కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రైతు చనిపోతే బీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నామన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు వైద్య కళాశాలలు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నామా? రాత్రింబళ్లు కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం ఇంత ప్రగతి సాధించిందని స్పష్టం చేశారు. మహబూబ్నగర్కు క్రీడా మైదానం, ఆడిటోరియం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని కేసీఆర్ వెల్లడించారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు రూ. 3 లక్షల చొప్పున మంజూరు చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు చొప్పున త్వరలోనే మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.