Heavy to Heavy Rains forecast for Telugu States (Today weather report Telugu) : దేశవ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో.. అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ముంబై, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ. ఆదివారం ఒక్కరోజు కురిసిన వర్షాలకే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.
బీహార్, హిమాలయ, పశ్చిమబెంగాల్, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ.. ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చంఢీగఢ్ , ఢిల్లీలలో.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ముఖ్యంగా అస్సాంలో 27 జిల్లాలపై వరద ప్రభావం ఉంది. ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. నదులు ప్రమాదకర స్థాయిని ప్రవహించడం, కొండ చరియలు విరిగిపడటంతో.. జాతీయ రహదారులపై రాకపోకలను నిలిపివేశారు అధికారులు. బీహార్ లో కోసి సహా.. నదుల నీటిమట్టం పెరగడంతో 7 జిల్లాలు జలదిగ్భంధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మరో 5 రోజులపాటు భారీ వర్షసూచన ఉండటంతో.. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అస్సాంలో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 109కి చేరుకుంది. 12 లక్షల మందిని సురక్షితప్రాంతాలకు చేర్చారు. 400 గ్రామాల ప్రజలు నిత్యావసరాల కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read : 6 గంటల్లో 30 సెం.మీల వాన.. ముంబైని షేక్ చేసిన వరుణుడు..
నిన్న సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ హైదరాబాద్ లో ఎడతెరపి లేని వర్షం కురవడంతో.. జనజీవనం స్తంభించింది. నాలాలు పొంగడంతో.. వీధుల్లోకి వర్షపునీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది. రహదారులన్నీ చెరువులను తలపించాయి. యూసుఫ్ గూడలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మెట్టుగూడలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. భూపాలపల్లి జిల్లాలో పోతులవాయి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. కాటారం, మేడారం వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కట్లేరు వద్ద వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో.. 20 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ లోనూ రెండ్రోజులుగా అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో భారీవర్షానికి కొండచరియలు విరిగి పడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు మరో నాలుగు రోజులపాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. నేడు, రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురవవచ్చని తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
Also Read : హైదరాబాద్లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కారు
భారీ వర్షాల కారణంగా.. కర్నూల్ జిల్లాలో తుంగభద్ర జలాశయానికి వరద తాకిడి పెరిగింది. ఇన్ ఫ్లో 16,313, క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1607.53 అడుగులుగా ఉంది. వరదనీరు మరింత ఎక్కువైతే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తెలంగాణలో.. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతుండటంతో.. భారీ వర్షసూచన చేసింది వాతావరణశాఖ. పశ్చిమనైరుతి దిశ నుంచి ఎగువస్థాయిలో గాలులు వీచే అవకాశం ఉండటంతో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాత్రి సమయాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.